Begin typing your search above and press return to search.

రైతు బిల్లులకు మద్దతా? నిప్పులు చెరిగిన కమల్

By:  Tupaki Desk   |   27 Sep 2020 3:39 PM GMT
రైతు బిల్లులకు మద్దతా? నిప్పులు చెరిగిన కమల్
X
కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్ లో ఆమోదించిన రైతు బిల్లులకు తమిళనాడు ప్రభుత్వం మద్దతు తెలుపడాన్ని సినీ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ తప్పుపడుతూ నిప్పులు చెరిగారు. ఇది రైతులకు తమిళనాడు సర్కార్ ద్రోహం చేయడమేనని స్పష్టం చేశారు. ఈ బిల్లులు రాష్ట్ర ప్రతివత్తిని నాశనం చేస్తాయని.. ధరలు అమాంతం పడిపోయి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రపతి ఈ రైతు వ్యతిరేక బిల్లులను తిప్పి పంపాలని.. వీటిపై సభలో చర్చ జరిగితేనే రైతులకు కొంత న్యాయం జరుగుతుందని కమల్ పేర్కొన్నారు. తనను తాను రైతుగా పేర్కొనే సీఎం ఫళని స్వామి ఈ బిల్లులకు ఎలా మద్దతిస్తున్నారని కమల్ హాసన్ ప్రశ్నించారు.

తమిళనాడులో వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికల్లో అన్నదాతలు ఈ ప్రభుత్వాన్ని మట్టిలో పూడ్చి పెట్టడం ఖాయం అని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. తన స్టేట్ మెంట్ ఇస్తున్న సందర్భంగా ఆయన ఈ బిల్లుల తాలూకు ప్రతులను చించి పోగులు పెట్టారు.

కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులను కమల్ హాసన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ బీజేపీ మిత్రపక్షం కావడంతో మద్దతుగా నిలుస్తోంది. అందుకే అన్నాడీఎంకేను కూడా వదలకుండా కమల్ విమర్శలు చేస్తూనే ఉన్నారు.