Begin typing your search above and press return to search.

నారా లోకేష్ కు తీవ్ర‌వాదుల నుంచి ముప్పు ఉంద‌న్న టీడీపీ నేత‌!

By:  Tupaki Desk   |   19 Feb 2020 3:30 AM GMT
నారా లోకేష్ కు తీవ్ర‌వాదుల నుంచి ముప్పు ఉంద‌న్న టీడీపీ నేత‌!
X
త‌మ పార్టీ నేత‌ - ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబుకు తీవ్ర‌వాదుల నుంచి ముప్పు పొంచి ఉంద‌ని అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేత క‌ళా వెంక‌ట్రావు. నారా లోకేష్ కు భ‌ద్ర‌త‌ను త‌గ్గించి వేశార‌ని - ఆయ‌న‌కు తీవ్ర‌వాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నా ఇలా భ‌ద్ర‌త త‌గ్గించి వేయ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు! ఉన్న‌ట్టుండి ఇలా లోకేష్ కు తీవ్ర‌వాదుల నుంచి థ్రెట్ ఉంద‌ని - స్వ‌యంగా ఒక టీడీపీ నేత అన‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంది.

చంద్ర‌బాబు నాయుడుకు భ‌ద్ర‌త‌ను త‌గ్గించి వేశార‌ని - ఒక రాష్ట్ర ప్ర‌తిపక్ష నేత‌కు భ‌ద్ర‌త‌ను త‌గ్గించ‌డం ఏమిట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబుకు భ‌ద్ర‌త‌ను 146 మంది స్థాయి నుంచి 67 మంది స్థాయికి త‌గ్గించార‌ని క‌ళా వెంక‌ట్రావు పేర్కొన్నారు. ఇది క‌క్ష సాధింపు అన్న‌ట్టుగా ఆయ‌న మాట్లాడారు.

చంద్ర‌బాబుకు కూడా కొన్ని వ‌ర్గాల నుంచి థ్రెట్ ఉంద‌ని క‌ళా పేర్కొన్నారు. మావోయిస్టుల నుంచి, ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల నుంచి చంద్ర‌బాబుకు ప్ర‌మాదం పొంచి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే చంద్ర‌బాబుకు ఆయ‌న కుటుంబీకుల‌కు భ‌ద్ర‌త తగ్గించింద‌ని ఈ తెలుగుదేశం నేత ఆరోపించారు.

అయితే అధికారంలో ఉన్న‌ప్ప‌టి తో పోలిస్తే ప్ర‌తిప‌క్షంలోకి వ‌చ్చాకా ఎవ‌రికైనా భ‌ద్ర‌త‌ను త‌గ్గించ‌డం జ‌రుగుతూ ఉంటుంది. కేంద్రంలో కూడా ఇలాంటివే జ‌రుగుతూ ఉన్నాయి. సోనియా - రాహుల్ - ప్రియాంక‌ - మ‌న్మోహ‌న్.. వీళ్లంద‌రికీ ప్ర‌త్యేక భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను మోడీ స‌ర్కారు తీసేసింది. ఏపీలో కూడా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిపక్షంలోకి వెళ్లాకా ఆయ‌న‌కూ భ‌ద్ర‌త ఏర్పాట్లు త‌గ్గి ఉండ‌వ‌చ్చు. అయితే త‌మ పార్టీ అధినేత‌కు, ఆయ‌న త‌న‌యుడికి తీవ్ర‌వాదుల నుంచి ముప్పు ఉంద‌ని.. టీడీపీ వాళ్లు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.