Begin typing your search above and press return to search.

మునుగోడు: ఎంపీటీసీ స్థానాలకు ఇన్ చార్జీలుగా కేటీఆర్, హరీష్

By:  Tupaki Desk   |   4 Oct 2022 6:43 AM GMT
మునుగోడు: ఎంపీటీసీ స్థానాలకు ఇన్ చార్జీలుగా కేటీఆర్, హరీష్
X
ఉప ఎన్నికలు వస్తే చాలు ఒక్కో నియోజకవర్గానికి ఒకరికి బాధ్యతలు అప్పజెప్పడం కేసీఆర్ కు అలవాటు. అప్పట్లో హుజూర్ నగర్ ను కేటీఆర్ చేతిలో పెట్టారు. గెలిపించాడు. ఇక రెబల్ ఈటలను ఓడించాలని హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. హుజూరాబాద్ లో హరీష్ గెలిపించలేకపోయారు.ఇక దుబ్బాకలోనూ అదే పరిస్థితి.

ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లే మూడ్ లో ఉండడంతో తెలంగాణలో జరిగే ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారింది. ఇజ్జత్ కా సవాల్ గా నిలిచింది. అందుకే మునుగోడును కేసీఆర్ అండర్ కంట్రోల్ లోకి తీసుకున్నారు. విజయమే లక్ష్యంగా కేసీఆర్ పక్కా ప్రచారానికి రంగం సిద్ధం చేశారు.

మునుగోడు నియోజకవర్గాన్ని ఎంపీటీసీ స్థానాలకు అనుగుణంగా ఒక యూనిట్ గా మార్చాడు కేసీఆర్. యూనిట్ కు మంత్రులు లేదా ఎమ్మెల్యేలను ఇన్ చార్జిలుగా నియమించారు. కేటీఆర్ కు గట్టుప్పల్, హరీష్ రావుకు మర్రిగూడ ఎంపీటీసీ స్తానాలను అప్పగించినట్టు తెలుస్తోంది. ఇంతకుముందు మండలాలను కేసీఆర్ కేటాయించేవారు. ప్రతి మండలానికి ఒక మంత్రిని.. కొన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలను నియమించేవాడు. ఈసారి స్ట్రాటజీ మార్చేశాడు.

ఈనెల 5న అభ్యర్థిని ప్రకటించి.. 6వ తేదీ నుంచే ప్రచారాన్ని ముమ్మరం చేయాలని కేసీఆర్ స్కెచ్ గీశాడు. జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న దృష్ట్యా సొంత రాష్ట్రంలోని మునుగోడును గెలిపించలేకపోతే ఆ అపవాదు కేసీఆర్ కు మాయని మచ్చగా ఉంటుంది. ప్రత్యర్థులు అవమానించేలా ఉంటుంది. అందుకే మునుగోడు గెలుపు బాధ్యతను కేసీఆరే భుజానకెత్తుకున్నారు. గెలిపించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.

సాధారణంగా ఉప ఎన్నికలకు నియోజకవర్గ ఇన్ చార్జీలుగా కేటీఆర్ లేదా హరీష్ లను నియమిస్తాడు. కానీ ఈ సారి వారిని ఎంపీటీసీ స్తానాలకు ఇన్ చార్జీలుగా పెట్టి మండలాల బాధ్యతలు అప్పగించడం విశేషం.

ఇలా ప్రతీ మండలానికి మంత్రులను, ఎమ్మెల్యేలను మోహరించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొని గెలిపించే బాధ్యతలను అప్పజెపుతున్నారు. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అన్దని వేచిచూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.