Begin typing your search above and press return to search.

'ఫాంహౌస్' ఆరోపణలపై స్పందించిన కేటీఆర్

By:  Tupaki Desk   |   7 Jun 2020 5:30 AM GMT
ఫాంహౌస్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్
X
హైదరాబాద్ గండీపేట సమీపంలోని జాన్వాడ గ్రామంలో జీవో 111 నిబంధనలకు విరుద్ధంగా ఫాంహౌస్ నిర్మించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి దీనిపై కోర్టులు - జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాడు. అక్రమ నిర్మాణంతో ప్రభుత్వ ఉత్తర్వులను కేటీఆర్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఈ మేరకు కేటీఆర్ కు నోటీసులు కూడా జారీ చేసింది.

గ్రీన్ ట్రిబ్యూనల్ నోటీసులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఒక కాంగ్రెస్ నేత తనపై దుష్ర్పచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఆ భూమి తనది కాదని గతంలోనే స్పష్టంగా చెప్పానని అన్నారు.

తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటానని మంత్రి కేటీఆర్ తెలిపారు. తనపై వచ్చినవన్నీ అసత్య ఆరోపణలని నిరూపిస్తానని కేటీఆర్ అన్నారు. ఉద్దేశపూర్వక పరువు నష్టం కలిగించారని.. వారిని న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.

అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా - ఎన్‌ జిటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) కెటిఆర్‌ తో పాటు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి - జిహెచ్‌ ఎంసి - హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా - మురుగునీటి బోర్డు - హెచ్‌ ఎండిఎ - హైదరాబాద్ సరస్సులు - వాటర్ బాడీ మేనేజ్‌ మెంట్‌ తో నోటీసులు జారీ చేసింది. ఎన్జీటి దర్యాప్తు ప్రారంభించింది. అక్రమ నిర్మాణం - అనుమతులు మరియు ఇతర వాస్తవాలను ధృవీకరించడానికి ఎన్జీటి నిజనిర్ధారణ కమిటీని ప్రారంభించింది.

రేవంత్ రెడ్డి ఆరోపణల ప్రకారం - ఫాం హౌస్ దాదాపు మూడు లక్షల చదరపు అడుగులలో మూడు అంతస్తులు - ఈత కొలను మరియు తోటతో నిర్మించారు.. ఫాంహౌస్ కోసం రహదారి వేయడానికి ఉస్మాన్ సాగర్ లో ఒక ప్రధాన నీటి వనరును మట్టితో మూసివేశారని రేవంత్ రెడ్డి పిటిషన్ లో ఆరోపించారు..