Begin typing your search above and press return to search.

వెల్లువెత్తే విమర్శలపై తెగించేసి మాట్లాడేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   22 July 2021 4:15 AM GMT
వెల్లువెత్తే విమర్శలపై తెగించేసి మాట్లాడేసిన కేసీఆర్
X
నువ్వు తప్పు చేస్తున్నావ్ అని ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఏం చేస్తాం? తొలుత ఆత్మరక్షణలో పడతాం. లేదు.. లేదు.. అలాంటిదేమీ లేదని చెబుతాం. అదేం కాదు.. నువ్వు చేస్తున్న తప్పుల చిట్టా చూసుకో.. అని మరోసారి గట్టిగా గదమాయిస్తే.. అటు నిజం చెప్పలేక.. ఇటు అబద్ధాన్ని కవర్ చేసుకోలేక పడే తిప్పలు అన్నిఇన్ని కావు.

కానీ.. అవును బై.. నేను చేస్తున్నా.. కానీ అది నువ్వు అన్నట్లు తప్పు కాదు.. ఒప్పంటే ఒప్పు. నువ్వు తప్పనుకుంటే అది నీ ఇష్టం అంటూ.. అడ్డంగా మాట్లాడేస్తే? అప్పటివరకు వేలెత్తి చూపించేటోడు గమ్మున ఉండిపోవాల్సిన పరిస్థితి. దూకుడుగా వ్యవహరించటం.. ఊహించని విధంగా రియాక్టు కావటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. ఆయన మాటలు ఎంత వ్యూహాత్మకంగా ఉంటాయన్న విషయాన్ని తాజాగా ఆయన చేసిన ప్రసంగాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతాయి.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. భారీగా ఓట్లు సొంతం చేసుకున్నప్పటికీ అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓడిన కౌశిక్ రెడ్డిని.. తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ కారు ఎక్కించేందుకు తానే స్వయంగా మెడలో పార్టీ కండువా వేసి మరీ ఆహ్వానించారు సీఎం కేసీఆర్.

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరీ ముఖ్యంగా.. ఈ మధ్యన తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని తెర మీదకు తీసుకురావటం.. పైలెట్ ప్రాజెక్టును త్వరలో ఉప ఎన్నికలు జరిగే హుజూరాబాద్ లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఏదో ఒక పథకాన్ని.. హామీని తీసుకొచ్చి సీఎం కేసీఆర్ ప్రజల్ని ఆకర్షిస్తారని.. వారిని మాయలో పడేసి.. ఓట్లు దండుకుంటారంటూ విపక్షాలతో పాటు.. కొన్ని మీడియా కథనాల్లో పేర్కొంటున్నారు.

ఇలాంటివేళ.. మరో నేత అయితే.. సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తారు. మంచిగా పాలిస్తుంటే.. ఏవో తప్పుడు ఎజెండా మనసులో పెట్టుకొని తమను బద్నాం చేస్తున్నారంటూ విరుచుకుపడతారు. అందరిలా అలా మాట్లాడితే ఆయన్ను కేసీఆర్ అని ఎందుకు అంటాం. మిగిలిన వారికి భిన్నంగా.. ఊహకు అందని రీతిలో రియాక్టు కావటం.. తెగించేసి మాట్లాడటంలో దిట్ట అయిన కేసీఆర్.. తెలంగాణ దళితబంధు ప్రోగ్రాంను ఉప ఎన్నిక కోసమే తీసుకొచ్చామంటూ కుండ బద్దలు కొట్టేసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది.

‘దళిత బంధు పథకం అమలుకు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్నే పైలట్‌గా తీసుకున్నం. ఎన్నికలున్నందుకే అక్కడ పెట్టినమని కొందరు అంటున్నరు. మరి పెట్టమా? టీఆర్ఎస్‌ ఏమైనా సన్నాసుల పార్టీయా? రాజకీయ పార్టీయే కదా? టీఆర్ఎ్‌సకు అధికారం ఉంటేనే కదా దళిత బంధు నడిపేది! మనమేమైనా హిమాలయ పర్వతాల్లో కూర్చున్నమా? ప్రజల్లో ఉన్నం.. కచ్చితంగా మనది రాజకీయ పార్టీ. పథకం పెట్టినప్పుడు రాజకీయంగా లాభం జరగాలని ఎందుకు కోరుకోము?’ అంటూ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా ముఖం పగిలేలా తేల్చేశారు కేసీఆర్.

తనపై సంధిస్తున్న విమర్శల్ని తిప్పి కొడుతూ.. తాను స్వార్థపరుడ్ని కాదని.. అదే అయితే.. ఈ పథకాన్ని గజ్వేల్ లో పెట్టేవాడ్ని కదా అంటూ దీర్ఘం తీసిన వైనం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకపక్క ఉప ఎన్నిక ప్రయోజనం పొందాలని భావిస్తున్నామని.. ఎందుకంటే తమది రాజకీయ పార్టీ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. సంచలనంగా మారాయి. తనకు హూజూరాబాద్ మీద ఉన్న సెంటిమెంట్ ను ప్రస్తావించారు.

రైతుబంధు పథకాన్ని కూడా అక్కడే ప్రారంభించామని.. కరీంనగర్ జిల్లా తనకు సెంటిమెంట్ జిల్లా అని.. మొట్టమొదటి సింహగర్జన కూడా అక్కడే జరిగిందని గుర్తు చేశారు. రైతుబీమా పథకాన్ని కూడా కరీంనగర్ టౌన్ లోనే రైతు సదస్సులోనే ప్రకటించిన వైనాన్ని గుర్తు చేశారు.

ఇంతలా తెగించి మాట్లాడటానికి కారణం ఏమిటన్నది చూస్తే.. ఇదేమీ ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు కావని.. వ్యూహాత్మకంగా చేసినవన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. డిఫెన్సులో పడినట్లుగా మాట్లాడితే విమర్శలు మరింత ఎక్కువ అవుతాయని.. అందుకే.. తెగించి మాట్లాడితే.. తర్వాత నుంచి మాట్లాడేది ఏముందన్న భావన కలిగించే మైండ్ గేమ్ లో భాగంగానే కేసీఆర్ నోటి నుంచి ఈ సంచలన వ్యాఖ్యలు వచ్చాయి.

అయితే.. తాను తీసుకొస్తున్న పథకం ఉప ఎన్నిక నేపథ్యంలోనే అనే అర్థం వచ్చేలా మాట్లాడిన మాటల వ్యవహారం కోర్టు ముందుకు వెళితే.. ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. ఈ తరహా తెగింపు వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమని చెప్పక తప్పదు.