Begin typing your search above and press return to search.

కేసీఆర్ స్వయంగా వచ్చి నాతో మాట్లాడాలి.. తేల్చేసిన గవర్నర్ !

By:  Tupaki Desk   |   16 May 2022 4:42 AM GMT
కేసీఆర్ స్వయంగా వచ్చి నాతో మాట్లాడాలి.. తేల్చేసిన గవర్నర్ !
X
కేంద్రంతో కయ్యం నడుపుతున్న తెలంగాణ రాష్ట్ర అధికారపక్షం ఇప్పుడు యుద్ధమే చేస్తుందని చెప్పాలి. సాధారణంగా కేంద్రం వర్సస్ రాష్ట్రమన్నప్పుడు.. కేంద్రానిది పైచేయిగా ఉంటుంది. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం సీన్ రివర్సు లో ఉంది. కేంద్రంపై పదునైన విమర్శలు చేస్తూ.. రాష్ట్రానికి ఏమీ చేయట్లేదన్న వాదనను బలంగా వినిపిస్తున్న కేసీఆర్ సర్కారు దెబ్బతో కమలనాథులు ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అవుతున్నారు. ఇదిలా ఉంటే.. గడిచిన కొంతకాలంగా సీఎం కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

సీఎం సిఫార్సు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థిని గవర్నర్ తిరస్కరించటంతో ఈ ఇద్దరి ప్రముఖల మధ్య దూరం పెరిగింది. మామూలుగా ఉన్నప్పుడు ఫర్లేదు కానీ.. తేడా వస్తే సీఎం కేసీఆర్ ఎలా వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. గవర్నర్ తమిళ సై విషయంలోనూ తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. రాష్ట్రానికి ప్రథమ పౌరురాలి అయినప్పటికీ ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు అందాల్సిన గౌరవ మర్యాదలు అందకపోవటం.. రివ్యూలకు సీఎస్.. డీజీపీలు రాకపోవటం లాంటి వరుస ఉదంతాలతో.. గవర్నర్ తమిళ సై ఓపెన్ అయ్యారు.

తనను అదే పనిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానిస్తున్నారంటూ గళం విప్పారు. ఢిల్లీకి వెళ్లిన సందర్భంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. కేసీఆర్ మీదా.. ఆయన ప్రభుత్వం మీద ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటంతో పాటు.. జాతీయ స్థాయిలో కేసీఆర్ సర్కారు ఇమేజ్ కు కాసింత డ్యామేజ్ చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో పొసగని గవర్నర్లు.. సాధారణంగా స్థానిక ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టేలా చర్యలు తీసుకుంటారు.అ ందకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తాను ఎంత కలిసిపోదామని భావిస్తున్నా.. కేసీఆర్ తనను అవమానిస్తున్న విషయాన్ని చెప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ అధినేత కు గవర్నర్ తమిళ సై ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగానే కాదు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా.. మంత్రులు కేటీఆర్ కానీ హరీశ్ కానీ తమ డెలిగేషన్ తో చర్చలకు వస్తే ఓకేనా? అన్న ప్రశ్నకు ఆమె స్పష్టంగా సమాధానం ఇచ్చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి.. తన వద్ద కూర్చొని మాట్లాడాల్సి ఉంటుందని చెప్పారు. రాజ్యంగబద్ధమైన ఉన్నత పదవిలో ఉన్న తన వద్దకు సీఎం రావాల్సిందేనని చెప్పారు. ఈ సందర్భంగా గతంలో కేసీఆర్ విభేదించిన అంశాన్ని తాను వివరించిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు వచ్చిందని చెబుతూ.. ఆ అంశాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఆమె మాటల్లోనే చూస్తే.."సీఎం కేసీఆర్‌ ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అంగీకరించలేదు. ఆరోగ్యశ్రీ మాత్రమే రాష్ట్రంలో కొనసాగాలన్నారు. దీంతో ఆయనకు నేను ఆయుష్మాన్‌ భారత్‌ ప్రయోజనాలను వివరించాను. తమిళనాడులో 'సీఎంఅండ్‌పీఎం' స్కీమ్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ను చేర్చడం వల్ల ఎక్కువ మంది లబ్ధి పొందారని చెప్పా.

నేను మాట్లాడిన విషయాల గురించి.. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ నేరుగా అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆయుష్మాన్‌ భారత్‌ను అమలు చేయడం వల్ల తెలంగాణకు దాదాపు రూ.800 నుంచి రూ.1000 కోట్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇదే విషయాన్ని నేను సీఎం కేసీఆర్‌కు చెప్పాను. ఇందులో తప్పేముంది? ఏదైనా ఉంటే నాతో కూర్చొని మాట్లాడితే సరిపోతుంది కదా" అని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మీదా.. ఆయన ప్రభుత్వం మీదా ఎలాంటి దురుద్దేశం లేదన్నారు.