Begin typing your search above and press return to search.

మోత్కుపల్లి చేరిక సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 Oct 2021 11:56 AM GMT
మోత్కుపల్లి చేరిక సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X
టీడీపీలో ఎంతో ఎత్తుకు ఎదిగి మంత్రి స్థాయికి ఎదిగిన మోత్కుపల్లి ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి బీజేపీలో చేరారు. అక్కడ కుదరుకోక బయటకు వచ్చి ప్రస్తుతం టీఆర్ఎస్ లోకి దూకారు. తాజాగా మోత్కుపల్లి నర్సింహులు అధికారికంగా టీఆర్ఎస్ లో చేరిపోయారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువా కప్పి మోత్కుపల్లిని సీఎం కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ పథకాలు, వివిధ నేతలతో అనుబంధాలు, పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ మాట్లాడుతూ 'మోత్కుపల్లి పరిచయం అక్కర్లేని వ్యక్తి అని.. నాకు అత్యంత సన్నిహితుడు అని ' కేసీఆర్ చెప్పుకొచ్చాడు. ఇద్దరం కలిసి అనేక ఏళ్లు పనిచేశామని.. గతంలో విద్యుత్ కోసం తెలంగాణ అనేక ఇబ్బందులు పడిందని.. విద్యుత్ శాఖ నిర్వహించిన మోత్కుపల్లికి ఈ కష్టాలు తెలుసన్నారు.

ఇక మోత్కుపల్లి వైద్యానికి రూ.కోటి ఖర్చయినా పర్లేదని కేసీఆర్ అభయమిచ్చారు. మోత్కుపల్లితో నా స్నేహం రాజకీయాలకు అతీతం అని చెప్పుకొచ్చారు. స్వరాష్ట్ర ఉద్యమంలో నన్ను తిట్టినన్ని తిట్లు దేశంలో ఎవరినీ తిట్టలేదని.. స్వరాష్ట్ర మద్దతు కోసం మాయావతిని 19 సార్లు కలిశానని కేసీఆర్ చెప్పుకొచ్చాడు. ఆమె తనతో మర్యాదగా.. ప్రేమగా మాట్లాడేవారని చెప్పారు. తెలంగాణ బాధలు చెబితే ఆమె కూడా మద్దతు ఇచ్చారని తెలిపారు.  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఎంతో కష్టపడ్డానని కేసీఆర్ అన్నారు. దేశంలోని రాజకీయ నేతలను ఎన్నో సార్లు కలిశానన్నారు. రాష్ట్రం సాధించాక ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు.

కళ్యాణలక్ష్మీ పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశఆరు. ఈ పథకంతో ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందిస్తుంటే పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్లు 'కేసీఆరే లక్ష ఇస్తుండు.. అని నువ్వెంత ఇస్తవ్ చెప్పు?' అని అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారి దవడ పగుల కొట్టమని సలహా ఇచ్చినట్లు చెప్పారు. పేదలకు పెళ్లి వల్ల అప్పులై ఇబ్బంది రావద్దని తాము ఈ పథకం తెస్తే ఇలా అడగటమేంటని ప్రశ్నించారు.

దళితబంధు పథకానికి రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని యోచన ఉందని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందని.. ఏడేళ్లలో దళితబంధుకు రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేయడం పెద్ద విషయం కాదని కేసీఆర్ తెలిపారు. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడి పెడితే రూ.10 లక్షల కోట్లు సంపాదిస్తది అని తెలిపారు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలన్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని.. బలమైన నాయకత్వం ఉంటేనే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కేసీఆర్ సూచించారు.