Begin typing your search above and press return to search.

సీఓటర్ పై కేసీఆర్ ఫ్యాన్స్ భగ్గు

By:  Tupaki Desk   |   8 Jun 2020 2:30 AM GMT
సీఓటర్ పై కేసీఆర్ ఫ్యాన్స్ భగ్గు
X
సీఓటర్ సర్వే దేశంలో మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఇందులో ఏపీ సీఎం జగన్ కు ఏకంగా 4వ స్థానం కట్టబెట్టింది. ఒడిషా సీఎంను దేశంలోనే నంబర్ 1 సీఎం అని పేర్కొంది. ఆ తర్వాత చత్తీస్ ఘడ్, కేరళం సీఎంలను రెండు, మూడో స్థానాలను సీఓటర్ కట్టబెట్టింది.

అయితే అందరూ ఊహించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను మాత్రం అట్టడుగున చేర్చడంపై తెలంగాణలోని ఆయన అభిమానులు అగ్గీమీద గుగ్గిలం అవుతున్నారు. లాక్ డౌన్ పరిస్థితులను ఎదుర్కోవడంతో అద్భుతంగా పనిచేశారని ప్రశంసలు అందుకున్న కేసీఆర్ ఈ సర్వే పట్టించుకోకపోవడంపై సోషల్ మీడియాలో నిప్పులు కురిపిస్తున్నారు.

మొన్నటి లాక్ డౌన్ వేళ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ఏపీసీఎం జగన్ కొంత తటపటాయించారు. కానీ కేసీఆర్ మాత్రం అద్భుతంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు ధైర్యం ఇవ్వడంలో చొరవ చూపారన్న వాదన ఉంది. కేసీఆర్ ప్రెస్ మీట్లు చాలా పాపులర్ అయ్యాయి. తెలంగాణ ప్రజలకే కాదు.. ఏపీ ప్రజలు కూడా కేసీఆర్ ప్రెస్ మీట్ వస్తుందంటే అన్ని కట్టిపడేసి చూశారంటే అతిశయోక్తి కాదు.. కరోనాను కట్టడి చేయడంలో.. లాక్ డౌన్ విధించడంలో.. వలస కార్మికులను ఆదుకోవడంలో.. పేదలకు రూ.1500, రేషన్ పంపిణీ, రైతులకు మద్దతు ధర విషయంలో కేసీఆర్ తీసుకున్న చర్యలు ప్రశంసలు కురిశాయి.

అయితే సీఓటర్ సర్వేలో మాత్రం మోస్ట్ పాపులర్ సీఎంలలో కేసీఆర్ అట్టడుగున ఉండడంపై గులాబీ పార్టీ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు జీర్ణించుకోవడం లేదు.

20 లక్షల కోట్ల ప్యాకేజీ పేరిట గాలి బుడగల లాంటి నిధులు వ్యయం చేసిన ప్రధాని నరేంద్రమోడీకి సీఓటర్ సర్వే పట్టం కట్టింది. ఆయనకు 65శాతం జనం మద్దతు పలికారని చెప్పింది. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తెలంగాణ, ఏపీలోనూ మోడీ సాయం చేయడంలేదన్న వాదన ఉంది. కానీ కేంద్రం పనితీరును మెచ్చిన రాష్ట్రంగా ఏపీ ఉన్నట్లుగా సీఓటర్ తెలుపడంపై అందరిలోనూ అనుమానాలకు కారణమవుతోంది.

కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు తెలంగాణ ప్రజలే కాదు.. ఏపీ ప్రజలు కూడా ఫిదా అయ్యారు. అలాంటి కేసీఆర్ ను సీఓటర్ పక్కనపెట్టడంపై సగటు తెలంగాణ వాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సోషల్ మీడియాలో సీఓటర్ ను కేసీఆర్ అభిమానులు కడిగిపారేస్తున్నారు.