Begin typing your search above and press return to search.

ఇవాళ ద‌త్త‌త గ్రామంలో కేసీఆర్ విస్త‌రి..

By:  Tupaki Desk   |   22 Jun 2021 5:42 AM GMT
ఇవాళ ద‌త్త‌త గ్రామంలో కేసీఆర్ విస్త‌రి..
X
ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త మూడు రోజులుగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇవాళ యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా త‌ర్క‌ప‌ల్లి మండ‌లంలోని త‌న ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రిలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ గ్రామానికి వ‌స్తున్నానని స్వ‌యంగా కేసీఆర్ గ్రామ స‌ర్పంచ్ కు ఫోన్ చేసి చెప్ప‌డం.. షెడ్యూలు కూడా ఖ‌రారు కావ‌డంతో.. అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. గ‌త మూడు రోజులుగా గ్రామంలో ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముందుగా గ్రామ‌స‌భ నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత గ్రామ‌స్తుల‌తో క‌లిసి స‌హ‌పంక్తి భోజ‌నాలు చేస్తారు. అయితే.. ఎవ‌రు ప‌డితే వాళ్లు స‌భ‌లో పాల్గొన‌గ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేస్తున్నారు. కేవ‌లం గ్రామ‌స్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. ఇత‌ర గ్రామాల నుంచి వ‌చ్చేవారికి ప్ర‌వేశం లేదు. ఇందుకోసం గ్రామ‌స్తుల‌కు ఎంట్రీ పాసులు కూడా అంద‌జేశారు.

గ్రామ‌స‌భ అయిన త‌ర్వాత వాసాల‌మ‌ర్రి గ్రామంలోని 2,600 మందితో క‌లిసి ముఖ్య‌మంత్రి భోజ‌నం చేస్తారు. ఈ ఏర్పాట్ల‌ను సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వ‌ర్గీస్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత‌, క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తితోపాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు, టీఆర్ఎస్ నేత‌లు ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

కాగా.. గ‌త ఆదివారం నుంచి కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు సాగిస్తున్నారు. తొలి రోజు సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి.. సోమ‌వారం వ‌రంగ‌ల్ జిల్లాకు వెళ్లొచ్చారు. ఇవాళ యాదాద్రి జిల్లాలో ప‌ర్య‌టిస్తారు.