Begin typing your search above and press return to search.

హమ్మయ్యా..ప్రకాశ్ రాజ్ కు కేసీఆర్ భరోసా దొరికిందబ్బా!

By:  Tupaki Desk   |   28 Jan 2020 1:55 PM GMT
హమ్మయ్యా..ప్రకాశ్ రాజ్ కు కేసీఆర్ భరోసా దొరికిందబ్బా!
X
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ నిన్నటిదాకా డేంజర్ జోన్ లోనే కొనసాగినా... టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన భరోసాతో ఒక్కసారిగా సేఫ్ జోన్ లోకి వచ్చేశారనే చెప్పాలి. జనవరి 29వ తేదీలోగా చంపేస్తామంటూ హెచ్చరికనందుకున్న ప్రకాశ్‌ రాజ్‌ నిన్నటిదాకా చాలా భయంభయంగానే గడిపారని చెప్పాలి. అసలే సాహితీవేత్తలు - ప్రజల వాణిని వినిపించేవారిపై కన్నడనాట దుండగులు తెగబడుతున్న వైనం మనకు తెలిసిందే. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ తో పాటు ముగ్గురు సాహితీవేత్తలను పొట్టనబెట్టుకున్న దుండగులు తాజాగా ప్రకాశ్ రాజ్ సహా పలువురు ప్రముఖులను చంపేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కన్నడ నాట ఉండాలంటేనే వారంతా భయంతో జడుసుకుంటున్నారు.

ఇలాంటి నేపథ్యంలో టాలీవుడ్ లోనే ఓ రేంజికి ఎదిగిన ప్రకాశ్ రాజ్ కు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ప్రకాశ్‌ రాజ్‌ కు ప్రాణభయం అంటూ పత్రికలు - వెబ్‌ సైట్లు పెద్ద ఎత్తున వార్తలను ప్రచురించడంతో కేసీఆర్ స్వయంగా స్పందించినట్లు తెలుస్తోంది. స్తుతం ప్రకాశ్‌ రాజ్ బెంగళూరులో ఉన్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకాశ్‌ రాజ్‌ కు మంగళవారం ఉదయం కాల్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘ బ్రదర్ వార్తలను చూసి మీరేమీ భయపడవద్దు. మీకు అండగా నేనున్నాను. ఎవరు ఏం చేస్తారో చూద్దాం. మీరు మా నివాసంలో ఉందురు గానీ హైదరాబాద్ రండి’’ అంటూ ప్రకాశ్ రాజ్ కు కేసీఆర్ పూర్తి భరోసా ఇచ్చారట.

కేసీఆర్ నుంచి అందిన ఇంత పెద్ద భరోసాతో నిన్నటిదాకా కొనసాగిన భయాన్ని ప్రకాశ్ రాజ్ దాదాపుగా వదిలేసి ధీమాగా ఉన్నారట. అంతేకాకుండా కేసీఆర్ మాటలతో ఉప్పొంగిపోయిన ప్రకాశ్ రాజ్... ‘‘జనవరి 29న హైదరాబాద్ లో ఉంటానని, తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను’’ అని కేసీఆర్ తో చెప్పారట. మొత్తంగా కన్నడనాట వచ్చిన బెదిరింపులకు తెలుగు నాట భరోసా లభించడంతో ప్రకాశ్ రాజ్.. బెంగళూరు వదిలేసి హైదరాబాద్ కు పయనమవుతున్నారు. దుండగులు చంపేస్తామంటూ ప్రకాశ్ రాజ్ తో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి - మరో 13 మందిని చంపేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే.