Begin typing your search above and press return to search.

భూకంపం పుట్టిస్తాన‌న్నావు... జాడ‌లేవేంది కేసీఆర్ సాబ్‌?

By:  Tupaki Desk   |   29 July 2021 4:30 PM GMT
భూకంపం పుట్టిస్తాన‌న్నావు... జాడ‌లేవేంది కేసీఆర్ సాబ్‌?
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హామీలు, మాట‌ల మాయ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న అద్భుత‌మైన వాక్చాతుర్యంతో కేసీఆర్ ఆయా సంద‌ర్భాల‌కు ఓ ప్ర‌త్యేక‌త‌ను జోడిస్తారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ గతంలో కేసీఆర్‌ చేసిన హడావుడి గుర్తుండే ఉంటుంది.

2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్‌పై హైప్ క్రియేట్ చేశారు. త‌ట‌స్థ కూట‌మి గురించి ఓ రేంజ్ లో స్పందించారు. అయితే, ఇప్పుడు అదే సంద‌ర్భంగా వ‌చ్చిన‌ప్ప‌టికీ కేసీఆర్ జాడ లేదేంట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా పర్యటించిన సీఎం కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ అజెండా విష‌యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, వైసీపీ అధినేత జగన్, సమాజ్‌ వాదీ పార్టీ నేత‌ అఖిలేశ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, త‌మిళనాడు ప్ర‌స్తుత సీఎం స్టాలిన్‌ సహా వివిధ పార్టీల నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించారు.

కాంగ్రెస్, బీజేపీలపై ఆధారపడని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఆ ఎన్నికల్లో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఫెడరల్ ఫ్రంట్ అంశం ప్ర‌స్తావ‌న‌కు రావ‌ట్లేదంటున్నారు.

ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రైతు చ‌ట్టాలు, ఫోన్ ట్యాపింగ్ అజెండాతో పాటుగా వివిధ అంశాల విష‌యంలో విప‌క్షాలు ఏకం అవుతున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్నారు. దేశంలో మోదీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తోపాటు కలిసి వచ్చే పార్టీలతో ముందుకు సాగాలని బెంగాల్ సీఎం మమత యోచిస్తున్నారు.

ఈ క్రమంలోనే థర్డ్ ఫ్రంట్ కు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనూ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన తాజా రాజకీయాలు, థర్డ్ ఫ్రంట్ అవకాశాలపై చర్చించారు. అయితే, ఈ విషయంలో దీదీకి కేసీఆర్ మద్దుతు ఇవ్వకపోడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా పలు రాజకీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. అయితే, ఈ విష‌యంలో కేసీఆర్ మాట మాత్ర‌మైన స్పందించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.