Begin typing your search above and press return to search.

ఉద్యోగుల‌కు మ‌ళ్లీ షాకిచ్చిన కేసీఆర్‌...కార‌ణం ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   27 May 2020 4:48 PM GMT
ఉద్యోగుల‌కు మ‌ళ్లీ షాకిచ్చిన కేసీఆర్‌...కార‌ణం ఏంటో తెలుసా?
X
క‌రోనా క‌ల‌కలం నేప‌థ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మ‌రోమారు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ద‌ఫా ఇటు సామాన్యుల‌కు వ‌ర్తించే విష‌యాల‌ను ఆయ‌న స‌మ‌గ్రంగా ప్ర‌స్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తాజాగా సమీక్ష నిర్వహించారు. ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ - ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు - సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు - ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు ప‌లు షాకింగ్ వార్త‌లు చెప్పారు.

అధికారులు రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప‌లు కీల‌క అంశాల‌ను నివేదించార‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. `తెలంగాణ రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలి. కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయింది. మే నెలలో కేంద్రానికి వెళ్లే పన్నుల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన 982 కోట్ల రూపాయలతో కలిపి కేవలం 3,100 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇటీవల ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదు. రిజిస్ట్రేషన్లు - రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదు. ఫలితంగా కొద్ది మొత్తంలోనే ఆదాయం వచ్చింది. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలు తీరాలి. రాష్ట్రం ఏడాదికి 37,400 కోట్ల రూపాయలను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలి. ఇవి ప్రతీ నెలా ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పులను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్.ఆర్.బి.ఎం. పరిమితి పెంచినప్పటికీ - కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితి లేదు. ఉద్యోగుల జీతాలు - పెన్షన్లు పూర్తిగా చెల్లిస్తేనే మూడు వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఖజానా ఖాళీ అవుతుంది. ఇక ఏ చెల్లింపు, ఏ పనీ చేసే వీలుండదు. కాబట్టి తగిన వ్యూహం అనుసరించాలి అని అధికారులు వివరించారు`` అని సీఎం కార్యాల‌యం ప్ర‌క‌ట‌న తెలిపింది.

దీంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం ప‌లు నిర్ణయాలు తీసుకుందని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం తెలిపింది. అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలి, ఆసరా పెన్షన్లను యధావిధిగా అందించాలని స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంద‌ని పేర్కంది. ``లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యాన్ని మే నెలలో కూడా అందించాలి. లాక్ డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతుంది. కాబట్టి ప్రతీ కుటుంబానికి నెలకు 1500 రూపాయల నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదు. `` అని తెలిపింది. ``ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలి.`` అని వెల్ల‌డించింది. ఇంతే కాకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు సైతం కోత ఉంటుంద‌ని ఇంకో షాక్ ఇచ్చింది.