Begin typing your search above and press return to search.

కేసీఆర్ సంచ‌ల‌నం..మ‌ళ్లీ లాక్ డౌన్ పొడ‌గింపు?!

By:  Tupaki Desk   |   27 May 2020 3:12 PM GMT
కేసీఆర్ సంచ‌ల‌నం..మ‌ళ్లీ లాక్ డౌన్ పొడ‌గింపు?!
X
దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల‌కలం నేప‌థ్యంలో విధించ‌బ‌డిన లాక్ డౌన్ ముగిసే గ‌డువు స‌మీపిస్తున్న త‌రుణంలో అంద‌రి చూపు ఇప్పుడు లాక్ డౌన్ 4.0పై ప‌డుతోంది. ఈ గ‌డువు ముగిసిన త‌ర్వాత లాక్ డౌన్ ఎత్తేస్తారా?అంటూ అంతా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. జూన్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ పొడ‌గిస్తార‌ని స‌మాచారం.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం, భార‌త‌దేశంలోనూ వైర‌స్ వ్యాప్తి జరిగిన త‌రుణంలో గ‌త మార్చి 21న సమావేశమైన కేంద్ర కేబినెట్‌ లాక్‌ డౌన్‌ ను ప్రతిపాదించింది. ప్రధాని నరేంద్రమోడీ పిలుపుమేరకు 22న దేశవ్యాప్తంగా ఒకరోజు జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరిగింది. 24 నుంచి లాక్‌ డౌన్‌ ప్రారంభమైంది. అయితే, దీనికంటే ముందే తెలంగాణ సీఎం కేసీఆర్‌ మంత్రిమండలి సమావేశం నిర్వహించి లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మితిమీరుతుండడంతో ఏప్రిల్‌ 14 వరకున్న లాక్‌ డౌన్‌ ను మే 3 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. అనంతరం జాతీయ స్థాయిలో కొన్ని రంగాలకు ప్రత్యేక సడలింపులిస్తూ ఈ నెల 31 వరకు పొడిగించారు. కానీ తెలంగాణ‌ రాష్ట్రంలో కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు కొనసాగించాలన్న అభిప్రాయంతో మే 7వరకున్న లాక్‌ డౌన్‌ ను 29 వరకు కొనసాగిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నార‌ని స‌మాచారం.

తాజాగా, తెలంగాణ‌ రాష్ట్రంలో కరోనా కేసులు అదుపు తప్పుతున్న నేపథ్యంలో ఈ నెల 29తో ముగియనున్న లాక్‌ డౌన్‌ ను మరిన్ని రోజులపాటు పొడిగించాలని ప్రభుత్వం సూచనప్రాయ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకున్న సడలింపులను ఎత్తివేసి కోవిడ్‌-19 నిబంధనలను మరింతగా కఠినతరం చేయాలన్న దిశగా సీఎం చేసీఆర్‌ చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

కేంద్రం ప్రకటన మేరకు ఈ నెల 31తో ముగియనున్న లాక్‌ డౌన్‌ గడువు రాష్ట్రంతో ఈ నెల 29 వరకు ఉంది. కొద్ది రోజుల క్రితం కేసులు తగ్గుముఖం పట్టినందున కొన్ని మినహాయింపులతో కూడిన పొడిగింపును ప్రస్తుతం కఠినతరం చేయనున్నారు. అధికారుల సూచనల మేరకు రెండు వారాలపాటు (జూన్‌ 14 వరకు) లాక్‌ డౌన్‌ ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ప్రజల నిత్యజీవన విధానానికి ఇబ్బందులు ఎదురుకాకుండా పరిమిత పడలింపులతో రాష్ట్రంలో నాలుగోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కుదేలైన రంగాలకు పాక్షిక మినహాయింపులతో పునరుద్ధరణకు ముఖ్యమంత్రి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.