Begin typing your search above and press return to search.

కేసీఆర్ క్యాబినెట్ నుండి ఆ మంత్రి అవుట్ ..?

By:  Tupaki Desk   |   19 Nov 2019 10:27 AM GMT
కేసీఆర్ క్యాబినెట్ నుండి ఆ మంత్రి అవుట్ ..?
X
తెలంగాణ లోని ప్రజలు గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమ్మె పై ప్రభుత్వం బెట్టువీడవక ..వేచి చూసే ధోరణి తో ఉండి చివరికి పథం నెగ్గించుకొంది. ఆర్టీసీ కార్మికులు ఈ రోజో ..రేపో సమ్మెకి ముగింపు పలకబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఆర్టీసి కార్మికులు తలపెట్టిన సమ్మె ఓ కొలిక్కి రావడంతో సీఎం కేసీఆర్ క్యాబినెట్ విస్తరణపై దృష్టి పెట్టినట్టు అర్థమౌతుంది. మంత్రుల పనితీరు - ప్రజామోదం ఆధారంగా కొందరిపై వేటు వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే మంత్రుల పనితీరు - లోక్ సభ ఎన్నికల్లో సరిగ్గా పనిచేయని మంత్రులను సీఎం కేసీఆర్ టార్గెట్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ క్యాబినెట్ నుండి బయటకి వచ్చే మొదటి మంత్రిగా .. మేడ్చెల్ ఎమ్మెల్యే చామ‌కూర మ‌ల్లారెడ్డి ఉండబోతున్నారు అనే వార్తలు బాగా బలంగా వినిపిస్తున్నాయి. ఎవరూ ఊహించని విధంగా మల్లారెడ్డి ని క్యాబినెట్ లోకి తీసుకున్న కేసీఆర్ .. ఆయ‌న‌కు కార్మిక‌ - ఉపాధి క‌ల్ప‌న‌ - మ‌హిళా - శిశుసంక్షేమ శాఖ‌ను అప్ప‌గించారు. అయితే శాఖాప‌రంగా ఆయ‌న ప‌నితీరు సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డంతో మ‌ల్లారెడ్డిని మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని సీఎం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

విద్యాసంస్థ‌ల అధినేత‌గా - వ్యాపార‌వేత్త‌గా గుర్తింపు పొందిన చామ‌కూర మ‌ల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేసి విజ‌యం సాధించారు. అనంతరం - రెండేళ్ల‌కే టీడీపీకి రాజీనామా చేసి - 2016 జూన్‌ లో టీఆర్ ఎస్‌ లో చేరారు. ఆ తరువాత 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఎంపీగా ఉన్న మ‌ల్లారెడ్డిని మేడ్చెల్ అసెంబ్లీకి పోటీ చేయించారు చంద్రశేఖర్ రావు. ఆ ఎన్నికలలో విజయం సాధించి ..కేసీఆర్ క్యాబినెట్ లో చోటు దక్కించుకొని అందరిని ఆశ్చర్య పరిచారు. ఇటీవ‌ల మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా నుంచి స‌బితా ఇంద్రారెడ్డిని కేబినెట్‌ లోకి తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఒకే జిల్లా నుంచి ఇద్ద‌రు మంత్రులు ఉండ‌టం - అది కూడా ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం కూడా పార్టీకి మంచిది కాదు అని, అలాగే ఈ ఏడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూడా చంద్రశేఖర్ రావు - మ‌ల్లారెడ్డి అల్లుడికి మ‌ల్కాజ్‌ గిరి ఎంపీ టికెట్ కేటాయించారు. రేవంత్‌ రెడ్డిని ఓడించేందుకు చంద్రశేఖర్ రావు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సీటు ఇచ్చినా అక్క‌డ టీఆర్ ఎస్ ఓడిపోవ‌డం మల్లారెడ్డి కి ప్రతికూలంగా మారింది. దీనితో మల్లారెడ్డి గురించి అన్ని విషయాలని బేరీజు వేసుకున్న తరువాతే సీఎం కేసీఆర్ ఈ సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.