Begin typing your search above and press return to search.

ఇదేమి ఖర్మ బాబూ : పాల్ పేల్చిన డైలాగ్ ఘాటుగా... సూటిగా...?

By:  Tupaki Desk   |   24 May 2022 3:30 PM GMT
ఇదేమి ఖర్మ బాబూ : పాల్ పేల్చిన డైలాగ్ ఘాటుగా... సూటిగా...?
X
కేఏ పాల్. మత ప్రభోధకుడు. ఇపుడు ఈయన మీడియాలో తెగ కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఆయన మాటలలో పంచులు అలా తెలియకుండానే పేలుతూంటాయి. ఈ మధ్య అంటే ఆదివారం ఒక ప్రముఖ చానల్ ప్రజా శాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ని పిలిచి ఆయన మనసు విప్పి చాలా విషయాలను తెలుసుకుంది. దాదాపు తొంబై నిముషాల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో కేఏ పాల్ చెప్పిన అనేక విషయాలు ఆసక్తిగా ఉన్నాయి.

ఇక ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుని అయితే అసలు ఏ మాత్రం వదిలిపెట్టలేదు. చంద్రబాబు తన దగ్గరకు తొలిసారి ఎమ్మెల్యేగా 1989లో వచ్చారని, నాడే ఆయనకు పలువురు దేశాధినేతలను పరిచయం చేశాను అని పాల్ చెప్పుకున్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉండగా బిల్ క్లింటన్ ని హైదరాబాద్ కి తీసుకువచ్చాను అని కూడా చెప్పారు.

బాబుకు ఆయన ప్రభుత్వానికి ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎంతో చేశానని, ఎన్నో రకాలుగా ఆదుకున్నాను అని పాల్ చెప్పారు. అలాంటి తనను చంద్రబాబు బాగా ఏడిపించారు అని ఆయన మండిపడ్డారు. తన వద్దకు అక్షరాలా 22 సార్లు చంద్రబాబు వచ్చారని ఎన్నో సహాయాలు పొందారని, కానీ తనను బాధపెట్టారు కాబట్టే ఈ రోజు ఏడుస్తున్నారని అది ఆయన ఖర్మ ఫలితం అని ఘాటైన పదజాలంతోనే పాల్ అనాల్సినవి అన్నీ అనేశారు.

అంతే కాదు, దేవుడిని బాబు ఏడిపించారని, సొంత మామ ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచి ఆయన్ని ఏడిపించారని, ఈ విధంగా చేయడం వల్లనే ఆయన దైవానికి దూరమై ఈ రోజు ఏడుస్తున్నారని కూడా పాల్ అంటున్నారు. ఆ మధ్య అసెంబ్లీ నుంచి బాబు బయటకు వచ్చి మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాల గురించి పాల్ మాట్లాడుతూ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు అని అందుకే బాబు ఇపుడు ఏడుస్తున్నారు అని కర్మ సిద్ధాంతం వల్లించారు.

మొత్తానికి చంద్రబాబు గతంలో బాగా ఉండేవారని, ఇపుడు ఆయన ఖర్మ అనుభవిస్తున్నారు అంటూ పాల్ చేసిన ఆ కామెంట్స్ టీడీపీ సానుభూతిపరుడిగా పేరుపొందిన సదరు చానల్ యజమాని కమ్ ఇంటర్వ్యూ చేస్తున్న పెద్ద మనిషి నోట్లో మాట రాకుండా చేశాయి. నా దగ్గరకు బాబు 22 సార్లు ఎందుకు వచ్చారంటారూ అని సదరు చానల్ యజమానిని కేఏ పాల్ ప్రశ్నించినపుడు ఖర్మ కాలి వచ్చి ఉంటారు అని ఆయన ఒకింత అసహనానికి గురై బదులివ్వడం విశేషమైతే నాడు పట్టింది ఖర్మ కాదు, ఇపుడు బాబుకు పట్టిందే అచ్చమైన ఖర్మ అంటూ పాల్ బాబు అనుకూల మీడియా పెద్దకే పాక్ గట్టి షాక్ ఇచ్చేశారు.

అదే ఇంటర్వ్యూలో మరో సందర్భంలో ఆయన మీరు నన్ను చంద్రబాబుకు మద్దతు ఇవ్వమంటారా అని సూటిగా అడగడమే కాదు, మీకు ఆయన బాగా ఇష్టమని తెలుసు కానీ నాకు కాదు అంటూ మరో కౌంటర్ వేసి ఆ మీడియా అధినేతకు ఇంకో షాక్ ఇచ్చేశారు. మొత్తానికి ఎందరో ఘనాపాటీలను ఇంటర్వ్యూ చేసి తన నోటి మాట వారితో పలికించి తన నేర్పరితనాన్ని ఎప్పటికపుడు చాటుకునే సదరు మీడియా అధిపతికి ఒక విధంగా కేఏ పాల్ చుక్కలు చూపించారు అనే అంటున్నారు.