Begin typing your search above and press return to search.

బీజేపీ చేయలేని పని పాల్ చేశారా ?

By:  Tupaki Desk   |   15 May 2022 7:30 AM GMT
బీజేపీ చేయలేని పని పాల్ చేశారా ?
X
కేసీయార్ తో పాటు ఆయన కుటుంబంపై తెలంగాణా బీజేపీ చాలాకాలంగా నానా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. కేసీయార్+కుటుంబం అత్యంత అవినీతి పరులని, వారిపై విచారణ చేయిస్తామని బీజేపీ చీఫ్ బండి సంజయ్ పదే పదే చెబుతున్నారు. అయితే బీజేపీ చేయలేని పనిని ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు, మత ప్రచారకుడు కేఏ పాల్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కేసీయార్ ను జైలుకు పంపడం ఖాయమంటూ ఇప్పటికి ఓ వందసార్లు హెచ్చరించుంటారు. అయితే చాలామందికి అర్ధంకాని విషయం ఒకటుంది.

అదేమిటంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే. తెలంగాణాలో కేసీయార్ ను హెచ్చరిస్తున్నది బీజేపీ చీఫ్. నిజంగానే కేసీయార్, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుంటే, అందుకు బీజేపీ దగ్గర ఆధారాలుంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నట్లు. కేంద్రంలో తమ ప్రభుత్వమే ఉన్నపుడు అవినీతికి సంబంధించిన ఆధారాలన్నింటినీ కేంద్రహోంశాఖకు ఫిర్యాదు చేయవచ్చు. లేదా డైరెక్టుగా ఆధారాలతో సీబీఐకి ఫిర్యాదు చేయాలి.

అయితే ఈ రెండు పనులనూ బీజేపీ చేయటం లేదు. ఎంతకాలమైనా కేసీయార్ ను బెదిరించటంతోనే కమలనాథులు కాలం గడిపేస్తున్నారు. అదే కేఏ పాల్ విషయం తీసుకుంటే ఆయన రెండు రోజుల క్రితం సీబీఐని కలిసి కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసినప్పుడు కూడా మరో ఫిర్యాదు చేశారు. కేసీయార్ అవినీతికి సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ అందించినట్లు పాల్ చెప్పారు.

కేఏ పాల్ చేయగలిగిన పనిని మరి బీజేపీ ఎందుకు చేయలేకపోయింది ? పైగా తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు పెట్టినా అధికారంలోకి వచ్చేది తామేనంటు ప్రతిరోజు బీజేపీ నేతలు నానా రచ్చ చేస్తున్నారు. కేసీయార్ ను రాజీనామా చేయమంటు డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ వరస చూస్తుంటే కేసీయార్ అవినీతిపై తన దగ్గర ఏమీ ఆధారాలున్నట్లు అనిపించటంలేదు. ఏదో ఒకటికి వందసార్లు ఆరోపణలు చేస్తు కాలం నెట్టుకొచ్చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఒకవేళ నిజంగానే ఆధారాలుంటే ఇంతకాలం బెదిరింపులతో కాలం గడిపేస్తారా ?