Begin typing your search above and press return to search.

జూనియర్ దగ్గుబాటికీ బాబు మార్క్ హ్యాండ్ ...?

By:  Tupaki Desk   |   30 Sep 2022 6:49 AM GMT
జూనియర్ దగ్గుబాటికీ  బాబు మార్క్ హ్యాండ్ ...?
X
తెలుగుదేశం పార్టీ పుట్టుక నుంచి ఉన్న ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు చివరికి చిన్నల్లుడు చంద్రబాబు దెబ్బకు టీడీపీతో శాశ్వతంగా సంబంధాలు తెంచుకున్నారు. ఇది చరిత్ర. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి 1995 వెన్నుపోటు ఎపిసోడ్ లో దగ్గుబాటిని చంద్రబాబు బాగా వాడుకున్నారు అన్నది అప్పట్లో జరిగిన ప్రచారం. మొత్తానికి తనకు ఏ పదవీ ఇవ్వకుండా చంద్రబాబు సిం హాసనం ఎక్కేసరికి నెల రొజులకే తత్వం బోధపడి ఎన్టీయార్ బతికుండగానే ఆయన పంచకు చేరారు పెద్దల్లుడు.

ఎన్టీయార్ పోయిన తరువాత ఆయన కాంగ్రెస్, బీజేపీ వైసీపీ రాజకీయాలను కూడా చూశారు. ఆయన సతీమణి, ఎన్టీయార్ తనయ పురందేస్వరి కాంగ్రెస్ లో రెండు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. విభజన దెబ్బకు ఏపీలో కాంగ్రెస్ కుదేల్ కావడంతో ఆమె ఇపుడు బీజేపీలో ఉన్నారు. ఇక దగ్గుబాటి వారి ఏకైక వారసుడు చెంచురాం హితేష్ ని టీడీపీలోకి పంపించి అక్కడ నుంచి ఎమ్మెల్యేను చేయాలని దగ్గుబాటి దంపతులు భావిస్తున్నారు అని వార్తలు ఈ మధ్య కాలంలో చాలానే వచ్చాయి.

అదే టైం లో దగ్గుబాటి చంద్రబాబుల మధ్య పాత శత్రుత్వం పోయి సాన్నిహిత్యం కూడా బాగా ఏర్పడింది అని కూడా జరుగుతున్న ప్రచారం బట్టి తెలుస్తోంది. ఇంకేముంది జూనియర్ దగ్గుబాటి వారు టీడీపీలో ఇలా ఎంట్రీ ఇవ్వడమే తరువాయి ఆయనకు కోరుకున్న సీటు ఇస్తారని కూడా అంతా భావించారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయినట్లుగా చెబుతున్నారు.

ఎక్కడైనా బావే కానీ వంగతోటలో కాదన్న సూత్రాన్ని చంద్రబాబు బాగా వంటబట్టించుకున్నారని అంటారు. అందుకే చెంచురాం హితేష్ కి టీడీపీలో టికెట్ లేదు అంటూ తాజాగా వస్తున్న వార్తల బట్టి తెలుస్తున్న విషయం. ప్రకాశం జిల్లా సొంత జిల్లాగా ఉన్న దగ్గుబాటి తన కుమారుడికి అయితే పర్చూరు లేకపోతే చీరాల టికెట్ ఇస్తారని అంచనా కడుతున్నారని అంటున్నారు.

అయితే మొదటే పర్చూరు టికెట్ లేదు అని తేలిపోతోంది. అక్కడ టీడీపీకి తొలి నుంచి పెద్ద కాపుగా ఏలూరు సాంబశివరావు ఉన్నారు. 2019 ఎన్నికల్లో దగ్గుబాటి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని బాబు తాజాగా ప్రకటించడంతో సాంబశివరావు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయనను జరిపి ఇపుడు దగ్గుబాటి వారికి పెద్ద పీట వేసే అయితే సీన్ లేదు.

మరి రెండవ చాన్స్ అంటే చీరాల శాసనసభ సీటు అని చెప్పాలి. అయితే ఇపుడు చీరాలలో కూడా నో చాన్స్ అని అంటున్నారుట. అదెలా అంటే చీరాలకు ఇంచార్జిగా మద్దులూరి మాల కొండయ్య ఉన్నారు. ఈయన విద్యా సంస్థల అధినేత. గతంలో టీడీపీ తరఫున ఒంగోలు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు ఆయన ఇపుడు ఇంచార్జిగా కాడె మోస్తున్నారు. దాంతో ఆయనకే టికెట్ అని చంద్రబాబు తాజాగా జరిగిన చీరాల నియోజకవర్గ సమీక్షా సమావేశంలో తేల్చి చెప్పారని అంటున్నారు. ఈ విషయం మీద క్లారిటీ కోసం పార్టీ నేతలు అధినాయకుడిని ప్రశ్నించగా ఇతర పార్టీల నుంచి నాయకులు వస్తే తీసుకుంటాం, అలాగే కొత్తగా పార్టీలో చేరేవారిని కూడా ప్రోత్సహిస్తాం, కానీ చీరాలలో మాత్రం కొండయ్య టీడీపీ అభ్యర్ధిగా ఉంటారు. ఆయన గెలుపునకు వారంతా కృషి చేయవ‌లసిందే అని స్పష్టం చేశారు.

కాగా ఈ విషయంలో క్లారిటీ రావడంతో చీరాలలో కొండయ్య వర్గీయులలో ఆనందం కనిపిస్తోంది. అదే టైం లో దగ్గుబాటి హితేష్ కి టికెట్ ఇవ్వరు అన్న వార్తలు మాత్రం చర్చకు తావిస్తున్నాయి. ఇదిలా ఉండగా దగ్గుబాటి హితేష్ టీడీపీలో చేరే అవకాశాలను మాత్రం చంద్రబాబు తోసిపుచ్చలేదు అని అంటున్నారు. అదే విధంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టికెట్లు అని మరో మారు బాబు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

అందరు ఇంచార్జిలకు టికెట్లు ఖాయమని చెప్పలేమని, వారి పార్టీ కోసం పనిచేసిన దానిని బట్టి అలాగే వారి గెలుపు అవకాశాలను అంచనా వేసి మాత్రమే టికెట్లు ఇస్తామని చంద్రబాబు పేర్కొనడం విశేషం. ఇక యువతకు కూడా నలభై శాతం టికెట్లు ఇస్తామని బాబు చెబుతున్నారు. దానికి సీనియర్లు సహకరించాలని ఆయన కోరుతున్నారు.

మొత్తానికి ఈ విషయాలు పక్కన పెడితే అటు పర్చూరు పోయి ఇటు చీరాల దక్కపోతే జూనియర్ దగ్గుబాటి టీడీపీలో చేరి సుఖమేంటి అన్న చర్చ ముందుకు వస్తోంది. ముందు పార్టీలో చేరి టీడీపీ గెలుపు కోసం దగ్గుబాటి ఫ్యామిలీ కృషి చేయాలని, ఆనక అధికారంలోకి వచ్చాక ఏదైనా చూస్తామని అంటే సీనియర్ దగ్గుబాటి ఓకే అంటారా. జూనియర్ దగ్గుబాటి సైకిలెక్కుతారా అన్నది చూడాల్సి మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.