Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ వర్ధంతి .. నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్‌

By:  Tupaki Desk   |   18 Jan 2020 5:21 AM GMT
ఎన్టీఆర్‌ వర్ధంతి .. నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్‌
X
నేడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు - నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి. ఎన్టీఆర్ వర్థంతి కావడంతో హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్ ఘాట్‌‌ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ - కళ్యాణ్ రామ్‌ తెల్లవారుజామున 5.30గంటలకు ఎన్టీఆర్‌ ఘాట్‌ కు వచ్చి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. తాతతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక కుటుంబ సభ్యులైన నందమూరి సుహాసిని - రామకృష్ణ దగ్గుబాటి - వెంకటేశ్వరరావు దంపతులు ..తదితరులు పుష్పగుఛ్చాలు ఉంచి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఆ తరువాత కొద్దిసేపు అక్కడే గడిపారు.

ఇటు ఎన్టీఆర్‌ కు నివాళులు అర్పించేందుకు అభిమానులు - టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని ఘాట్ చుట్టూ ప్రదక్షిణలు చేసి - పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. ఇటు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదాన - ఉచిత వైద్య శిబిరాలు - సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌ లో ర్యాలీ ఏర్పాటు చేశారు. సనత్‌ నగర్‌ నియోజకవర్గంలోని రసూల్‌పూర చౌరస్తా ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత - మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతారని సమాచారం.