Begin typing your search above and press return to search.

ఎవరీ జితేంద్ర గోగి? అతని క్రైం హిస్టరీ ఎంతంటే?

By:  Tupaki Desk   |   25 Sep 2021 3:54 AM GMT
ఎవరీ జితేంద్ర గోగి? అతని క్రైం హిస్టరీ ఎంతంటే?
X
రీల్లో కూడా కనిపించని సినిమాటిక్ సీన్ ఒకటి రియల్ గా దేశ రాజధాని ఢిల్లీలోని ఒక కోర్టు హాల్లో చోటు చేసుకోవటం తెలిసిందే. ఉత్తర ఢిల్లీలోని రోహిణి కోర్టులో లాయర్లు.. కక్షిదారులతో హడావుడిగా ఉన్న వేళ కోర్టు హాల్ నెంబరు 207లో గ్యాంగ్ స్టర్ కమ్ పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన జితేంద్ర గోగిని.. లాయర్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు పిస్టల్స్ తో కాల్చేయటం.. ఈ షాక్ నుంచి తేరుకున్న ఎస్కార్ట్ పోలీసులు అప్రమత్తమై ఆ ఇద్దరు నిందితుల్ని కాల్చి చంపటం తెలిసిందే. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ కాల్పుల ఉదంతం పెను సంచలనంగా మారింది.

కోర్టు హాల్లో విచారణలో ఉన్న గ్యాంగ్ స్టర్ జితేంద్ర గోగి ఎవరు? అతని నేరచరిత్ర ఎలాంటిది? అతన్ని చంపిందెవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి. జితేంద్ర గోగికి టిల్లూ గ్యాంగ్ కు మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న ఈ అధిపత్య పోరు కారణంగా ఇరువర్గాలకు సంబంధించి ఇప్పటివరకు పాతిక మంది మరణించారని పోలీసులు చెబుతున్నారు.

దాదాపు ఏడాదిన్నర కాలంగా జైల్లో ఉన్న జితేంద్ర గోగిని జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేసినా.. సాధ్యం కాలేదని చెబుతారు. దీంతో.. విచారణ కోసం కోర్టుకు వచ్చిన అతన్ని ఎటువంటి పరిస్థితుల్లో మిస్ కాకుండా చంపేయాలన్న ప్లాన్ తోనే ప్రత్యర్థులు ఈ తీరులో ప్లాన్ చేశారని చెబుతున్నారు. కోర్టులోకి ఆయుధాలతో ప్రవేశించిన ఇద్దరు నిందితులు.. మెటల్ డిటెక్టర్లు ఉన్నా.. అలా ఎలా రాగలిగారు. అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.ఇంతకీ ఈ జితేంద్ర గోగి ఎవరు? 37 ఏళ్ల వయసున్న ఇతను గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు? అతడి నేర చరిత్ర ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

ఢిల్లీకి చెందిన జితేంద్ర గోగి స్కూల్ దశలోనే చదువు మానేశాడు. తన తండ్రి మరణంతో అతను నేరాల బాట పట్టాడు. హత్య.. హత్యాయత్నాలు.. దోపిడీలు.. దొంగతనాలు.. బలవంతపు వసూళ్లు లాంటి నేరాల్లో అతను నిందితుడు. అతడిపై 19 కేసులు ఉన్నాయి. పలుమార్లు జైలుకు వెళ్లినా అతను తన తీరును మార్చుకోలేదు.తన అనుచరుడైన నిరంజన్ హత్యలో సంబంధం ఉన్న దేవేందర్ ప్రధాన్ అనే వ్యక్తిని 2017 ఫిబ్రవరిలో ఉత్తర ఢిల్లీలోని అలీపూర్ లో హత్య చేశాడు. అదే ఏడాది హర్యానాకు చెందిన ఫోకస్ సింగర్.. డ్యాన్సర్ హర్షితలను హత్య చేశాడు.

తన అనుచరుడు దినేశ్ హత్య కేసులో ఆమె ప్రధాన సాక్షి కావటంతో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. దీపక్ అనే ఉపాధ్యాయుడ్ని.. రవి భరద్వాజ్ అనే వ్యక్తిని గోగి మనుషులు చంపేశారు. ఆమ్ ఆద్మీ నేత వీరేంద్ర మన్ ను కూడా ఇతడి గ్యాంగ్ సభ్యులు కాల్చేశారు. 2011లోనూ 2016లోనూ అరెస్టు అయిన అతడను తర్వాత కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిన ఇతడి గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.4లక్షలు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం.. రూ.2లక్షల రివార్డు ఇస్తామని హర్యానా ప్రభుత్వం ఇతనికి రేటు కట్టింది.

గోగిని.. అతని రైట్ హ్యాండ్ అయిన కుల్ దీప్ మాన్ ను గత ఏడాది ఏప్రిల్ లో అరెస్టు చేశారు. కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కుల్ దీప్ ను పోలీసులు కాల్చి చంపారు. గోగి మాత్రం అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నాడు. తాజాగా అతను విచారణకు కోర్టుకు రాగా.. హాల్లోనే అతని ప్రత్యర్థులు అతనిపై పిస్టోల్ తో కాల్పులు జరిపి చంపేశారు. పోలీసుల కాల్పుల్లో వారూ చచ్చిపోయారు.