Begin typing your search above and press return to search.

నేనిలా మాట్లాడడానికి కారణం అదే: జక్కంపూడి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   26 Sep 2021 7:30 AM GMT
నేనిలా మాట్లాడడానికి కారణం అదే: జక్కంపూడి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు
X
తూర్పుగోదావరి జిల్లా అధికార పార్టీలో కోల్డ్ వార్ తారాస్థాయికి చేరుకుంటోంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి శ్రీనివాస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఎంపీ మార్గాని భరత్ పై విమర్శలు చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే తనపై ఆరోపణలు చేయడంతో మార్గాని భరత్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసంటూ ఇటీవల ఫైర్ అయ్యారు. అయితే ఇరువురి మధ్య సాగుతున్న పోరుతో పార్టీలోని నాయకులు ఆయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తాజాగా ఓ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'మా నాన్న గారు ఉమ్మడి రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచే నాకు వైఎస్సార్ తో ఎంతో అనుబంధం ఉంది. ఆ తరువాత జగన్ పార్టీలో కూడా నేను ఎప్పటి నుంచో కొనసాగుతున్నాను. ఈ తరుణంలో ఎంపీ భరత్ పై నాకు ఎలాంటి జలసి లేదు. రాజకీయ నాయకులకు పబ్లిసిటీ అవసరమే. కానీ దానికి ఓ స్థాయి ఉంటుంది. అందువల్ల పబ్లిసిటీ కోసం నేను రాజకీయాలు చేయడం లేదు. సాయం కోసం మనదగ్గరకి వచ్చినప్పుడు వాళ్ల పేదరికాన్ని పబ్లిసిటీ చేసి.. వారి పేదరికాన్ని ప్రపంచానికి తెలుపుతూ దానిని తనకోసం వాడుకునే పబ్లిసిటీ అనేది నాకు నచ్చదు. '

జక్కంపూడి మాట్లాడుతూ.. 'పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తే కొంతకాలం గుర్తు పెట్టుకుంటారు కావచ్చు. కానీ వారికి శాశ్వత నివాసం కల్పిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అలా నా నియోజకవర్గంలో ప్రతి పేదవారికి ఇళ్లు కట్టించాలని లక్ష్యం పెట్టుకున్నాను. వైసీపీ ప్రభుత్వ లక్ష్యం కూడా అదే. అయితే ఈ తరుణంతో నాపై భూముల విషయంలో వివాదం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పేదలకు ఇళ్లు కట్టించాలన్న తపన తప్పితే వ్యక్తిగతంగా నాకు ఎలాంటి భూములు అవసరం లేదు. రాజమండ్రి సిటీలో కొంత మంది పేదలకు ఇళ్లు ఇవ్సాల్సి ఉండగా.. వాటిని ఇవ్వలేదు. ఆ విషయంపై మాత్రమే కొశ్చెన్ చేస్తున్నా..కానీ వాటాల కోసమే ఆరోపణలు చేస్తున్నారని అవసరంగా రాద్దాంతం చేస్తున్నారు.'

'ఈ విషయంపై పార్టీ పెద్దలను కలిసి చాలాసార్లు విన్నవించారు. పార్టీ రీజనల్ నాయకుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారికి కూడా చెప్పా.. అయితే ఈలోపే ఇక్కడ సమస్యను తీవ్రం చేయడంతో పబ్లిక్ సర్వెంట్ గా బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చింది. ఈ విషయంపై ప్రతిపక్షాల వాళ్లు పార్టీ గురించి మాట్లాడకముందే నేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పార్టీ స్టాండ్ చెప్పాల్సి వచ్చింది. అయితే రాజారాం నగర్ కు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన సమయం సీఎం జగన్ కు లేదు. అందువల్ల ఈ నియోజకవర్గ ప్రతినిధిగా నేనే ఈ సమస్యను బయటపెట్టాల్సి వచ్చింది.'

'వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానంతో చాలా మంది కార్యకర్తలు ఇతర పార్టీలను వీడి వచ్చారు. వైసీపీ కోసం తమ శాయశక్తులా కష్టపడుతున్నారు. అలాంటి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. వారికోసం తపన పడడమే మా ధ్యేయం. అయితే ఈ సమస్య కేవలం రాజారాం నగర్లోనైనా.. రాజమండ్రిలోనైనా.. స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది. జిల్లాలో ఎక్కడ వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగినా అందుకు బాధ్యులం మేమే అవుతాం. ఈ తరుణంలో వారికి న్యాయం దక్కేలా కృషి చేస్తాం. '

జక్కంపూడి మాట్లాడుతూ.. 'నా వెనుక పెద్ద నాయకుడు ఉన్నారు. ఆయనెవరో కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయనకు మేం ఆత్మాహుతి దళం లాంటి వాళ్లం. ఆయనకు ఏం జరిగినా ఆయన కోసం మేం ప్రాణాలను కూడా విడవడానికి వెనుకాడం. ప్రారంభం నుంచి జగన్ గారితో ఉన్నప్పుడు ఆయనకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. ఆయన మా వెనుక ఉన్నాడనే ధీమాతోనే నేను ధైర్యంగా అన్నీ మాట్లాడగలుగుతున్నా..' అని జక్కంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు.