Begin typing your search above and press return to search.

నాకు కరోనా సోకింది... ఇప్పుడు తగ్గిందంటూ ప్రకటించిన ఆ ఎమ్మెల్యే !

By:  Tupaki Desk   |   10 Aug 2020 4:45 PM GMT
నాకు కరోనా సోకింది... ఇప్పుడు తగ్గిందంటూ ప్రకటించిన ఆ ఎమ్మెల్యే !
X
ఏపీలో కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా ప్రతి రోజు కూడా 10 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య భారీగా పెంచడం వలనే .. కరోనా పాజిటివ్ కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి అని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో సామాన్యులతో పాటుగా కరోనా భారిన పడే ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే 15 మందికి పైగా ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.

అయితే, అందరిలా కరోనా పాజిటివ్ వచ్చింది అని చెప్పడం దేనికి అని అనుకున్నారేమో .. కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యి , పూర్తిగా తగ్గి , టెస్టులో మళ్లి నెగటివ్ వచ్చాక , కరోనా నెగటివ్ వచ్చింది అని ప్రకటించారు. ఆ ఎమ్మెల్యే ఎవరా అనుకుంటున్నారా ..ఆయన ఎవరో కాదు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. తనకు జూలై 26వ తేదీన కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని , కరోనా సోకిందని తెలిసిన తర్వాత , తాను చాలా ధైర్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన చెందాల్సిన పనిలేదని ,14 రోజుల హోం ఐసొలేషన్ లో ఉన్నాక మళ్ళీ కరోనా పరీక్ష చేయించడంతో నెగిటివ్ ‌గా నిర్దారణ అయిందన్నారు. త్వరలోనే మీ ముందుకు వస్తానని తెలిపారు. కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదన్న జాగ్రత్తగా ఉండి, భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని ప్రజలను కోరారు. అలానే తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా తన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , కరోనా నుండి పూర్తిగా కోలుకునట్టు వెల్లడించారు.