Begin typing your search above and press return to search.

మూడు రాజధానులు కాదు... మూడు రాష్ట్రాలు...సీఎంలు ఎవరంటే...?

By:  Tupaki Desk   |   27 Sep 2022 2:30 PM GMT
మూడు రాజధానులు కాదు... మూడు రాష్ట్రాలు...సీఎంలు ఎవరంటే...?
X

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మూడు రాజధానుల ఇష్యూ నడుస్తోంది. అమరావతి ఏకైక రాజధాని అంటే వైసీపీ ఒప్పుకోవడం లేదు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి సాధించాలని నినదిస్తోంది. దాంతో ఆ రచ్చ అలా సాగుతూండంగానే తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఎంటర్ అయ్యారు. ఆయన అలా ఎంటర్ కావడానికి తెలంగాణాలో పార్టీ పెట్టి హల్ చల్ చేస్తున్న వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల కారణం.

ఆమె పాదయాత్ర జగ్గారెడ్డి సొంత నియోజకవర్గం సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా షర్మిల జగ్గారెడ్డి అనేక పార్టీలు మార్చారు, రాజకీయ వ్యభిచారి అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు. దానికి బదులుగా రెచ్చిపోయిన జగ్గారెడ్డి ఏపీ రాజకీయాల మీద తన బాణాలు వేశారు. ఏపీ సీఎం జగన్ తో పాటు వైఎస్సార్ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేశారు.

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి గులాం గిరీ చేస్తున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు. ఇక తెలంగాణాలో షర్మిల కూడా బీజేపీ డైరెక్షన్ లో సాగుతోందని విమర్శించారు. తెలంగాణాలో ఏపీ ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి లబ్ది చేకూర్చడానికే షర్మిల చూస్తున్నారు అని జగ్గారెడ్డి అటాక్ చేశారు. షర్మిలకు ముఖ్యమంత్రి పదవి మీద ఆశ ఉందని ఆయన అంటున్నారు. అది వైఎస్సార్ చనిపోయిన తరువాత నుంచే కుటుంబంలో నడుస్తున్న పంచాయతీ అని అన్నారు.

ఆ పంచాయతీ గొడవలు జగన్ తో తెమలకనే షర్మిల తెలంగాణా వచ్చి పార్టీ పెట్టారని ఆరోపించారు. షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా కాళ్ళూ చేతులు విరగ్గొట్టుకున్నా కూడా తెలంగాణాలో రాజకీయాలు చేసి సీఎం కాలేరని జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. దానికి బదులుగా ఆమె తెలంగాణాను వదిలేసి ఆంధ్రాకు వెళ్తే మంచిదని కూడా సలహా ఇచ్చారు. ఎటూ ఏపీలో మూడు రాజధానుల ఇష్యూ నడుస్తోంది కదా దాన్ని కాస్తా మూడు రాజధానులుగా చేసుకుంటే బాగుంటుందని ఆయన సెటైర్లు వేశారు.

అమరావతికి జగన్ సీఎం గా ఉంటే విశాఖకు విజయసాయిరెడ్డి ఉంటారని, కడప కర్నూల్ లకు షర్మిల సీఎం అవుతుందని ఆయన తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి మూడు రాజధానుల మీద జగ్గారెడ్డి చిత్రంగా మూడు రాష్ట్రాలుగా మార్చి కామెంట్స్ చేయడమే కాదు, షర్మిలది పదవీ దాహమని తేల్చారు. వైఎస్సార్ ఫ్యామిలీలో రాజకీయ పోరుతో తనను విమర్శిస్తే ఊరుకోనని హెచ్చరించారు. మొత్తానికి మూడు రాజధానుల విషయంలో మూడు రాష్ట్రాలు అంటూ జగ్గారెడ్డి వేసిన సెటైర్లు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చగా ఉన్నాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.