Begin typing your search above and press return to search.

అంత పెద్ద వివాదాన్ని తిరునామంతో తేల్చేసిన జగన్

By:  Tupaki Desk   |   24 Sep 2020 8:10 AM GMT
అంత పెద్ద వివాదాన్ని తిరునామంతో తేల్చేసిన జగన్
X
తీవ్రమైన సమస్యను సైతం సింఫుల్ గా తేల్చేయొచ్చు. కాకుంటే.. కాస్తంత బుద్ధి కుశలత.. సమయస్ఫూర్తి ఉంటే సరిపోతుంది. అదే పనిగా ఇబ్బంది పెట్టే ప్రత్యర్థులకు మౌనంగా చెక్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టువస్త్రాలు ఇచ్చే కార్యక్రమానికి సీఎం హోదాలో జగన్ హాజరు కావాల్సి ఉండటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అన్యమతస్తులు స్వామి వారిని దర్శనం చేసుకునే సమయంలో ఇచ్చే డిక్లరేషన్ మీద టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారటమే కాదు.. చూస్తుండగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

మీడియాలోనూ.. సోషల్ మీడియాలో ఈ అంశంపై సాగిన రచ్చ అంతా ఇంత కాదు. ఏపీ మంత్రి కొడాలి నాని లాంటి వారు రంగ ప్రవేశం చేయటంతో ఈ ఇష్యూ మరింతగా ముదిరింది. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. మిత్రుడు కమ్ అప్పుడప్పుడు విపక్షంగా వ్యవహరించే బీజేపీ నేతలు కస్సుమనటం.. దానికి అధికారపక్షం కౌంటర్లు ఇవ్వటంతో.. జగన్ తిరుమల పర్యటన ఎలా సాగుతుందన్నది ప్రశ్నగా మారింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జగన్ ను విపరీతంగా అభిమానించే వారిలోనూ ఈ వ్యవహారం కన్ఫ్యూజింగ్ కు గురి చేసింది. ఈ ఇష్యూను జగన్ ఎలా డీల్ చేస్తారా? అన్న ఉత్కంఠ చాలామందిలో కనిపించింది.అందరి అంచనాలకు భిన్నంగా తన మీద అప్పటివరకు వినిపిస్తున్న విమర్శలకు చెక్ చెబుతూ.. తనదైన శైలిలో రియాక్టు అయ్యారు జగన్. తిరుమలకు చేరుకున్న ఆయన.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించటానికి ముందు.. నుదుటిన నామాలు పెట్టించుకున్నారు. పంచె కట్టుకొని.. పూర్తి సంప్రదాయబద్ధంగా మారి.. పట్టువస్త్రాల్ని స్వామికి అందజేశారు.

అన్యమతస్తులకు డికర్లేషన్ నింపాలన్న వాదనకు పూర్తిస్థాయిలో చెక్ చెప్పటమే కాదు.. తాను పెట్టుకున్న నామాలతో డిక్లరేషన్ మాట అవసరం రానట్లుగా ఇష్యూను జగన్ తేల్చేశారు. నామాలు పెట్టుకొని.. పంచె కట్టుకొని ఆలయానికి వెళ్లటం ద్వారా.. సున్నితమైన అంశాల్ని ఎంత సింపుల్ గా తేల్చేయొచ్చన్న విషయాన్ని ఏపీ సీఎం చేతల్లో చేసి చూపించారని చెప్పాలి.