Begin typing your search above and press return to search.

రాజ్యసభ ఎన్నికలు..జగన్ కు కత్తి మీద సామే!

By:  Tupaki Desk   |   26 Feb 2020 3:30 AM GMT
రాజ్యసభ ఎన్నికలు..జగన్ కు కత్తి మీద సామే!
X
పార్లమెంటులో పెద్దల సభ రాజ్యసభలో ఖాళీ కానున్న సీట్లలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కోసం ఏపీలో అధికార పార్టీ వైసీపీ చాలా కాలం నుంచే వేచి చూస్తోంది. అదే సమయంలో తమకు సింగిల్ సీటు కూడా దక్కదన్న విషయాన్ని ముందే గ్రహించిన విపక్షం టీడీపీ సహా మిగిలిన పార్టీలు ఈ నోటిఫికేషన్ ను అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వైసీపీలో నోటిఫికేషన్ విడుదల కావడంతో హడావిడి పెరిగిపోయింది. అదే సమయంలో అభ్యర్థులను ఖరారు చేయాల్సిన పని పడటంతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరింత పనిభారం పడిపోయింది. అందుబాటులో నాలుగు సీట్లు మాత్రమే ఉంటే... వాటిని ఆశిస్తున్న నేతల సంఖ్య పదికి పైగా ఉండటంతో జగన్ కు ఈ కసరత్తు కాస్త ఇబ్బందికరంగానే మారిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న టి.సుబ్బరామిరెడ్డి, ఖాన్, సీతారామలక్ష్మి, కేశవరావుల పదవీకాలం ముగుస్తోంది. ఏప్రిల్ 2తో వీరికి గడువు తీరుతుంది. ఈ నాలుగు స్ధానాలు ఎవ్వరికి అవకాశం దక్కబోతోందన్న అంశంపై వైసీపీలో ఆసక్తికర చర్చకు తెర లేసింది. ఏ ఎన్నికలు వచ్చినా సామాజిక వర్గాల సమీకరణను పాటిస్తూ సాగుతున్న జగన్... మరి ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లోనూ అదే ఫార్మ్యూలాను పాటిస్తారా? లేదంటే... పార్టీ ముఖ్యులంటూ సామాజిక వర్గాల సమీకరణను పక్కనపెట్టేసి ముందుకు సాగుతారా? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. గతంలో మాదిరే అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చేలానే జగన్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అందులోనూ ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

వైసీపీలో రాజ్యసభ సీటు ఆశిస్తున్నవారి సంఖ్య భారీగానే ఉంది. ప్రస్తుతం నెల్లూరుకు చెందిన బీసీ నేత బీద మస్తాన్ రావు - టీటీడీ ఛైర్మెన్ - జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి - మంత్రి మెపిదేవి వెంకటరమణ - గోకరాజు రంగరాజు - సినీ నటుడు ఆలీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ - మండలి ఛీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - రాంకీ అధినేత అయెధ్యరామిరెడ్డి కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సామాజిక సమీకరణాల లెక్కల్లో రెడ్డి సమాజిక వర్గానికి చెందిన విజయసాయిరెడ్డి - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. బీసీల కోటాలో బీదా మస్తాన్ రావు పేరు దాదాపు ఖరారయినట్లే. అలాగే బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజుకు అవకాశం ఇవ్వడానికే అధిష్టానం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది.. మిగిలిన రెండింటిలో మైనార్టీలకు, ఎస్సీలకు ఇస్తారా లేక పదవులు కోల్పోయే మంత్రులకు అవకాశం కల్పిస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.