Begin typing your search above and press return to search.

ఎవరిని ఎలా వాడాలో కేసీఆర్ కు చాలా బాగా తెలుసట

By:  Tupaki Desk   |   15 Aug 2022 4:26 AM GMT
ఎవరిని ఎలా వాడాలో కేసీఆర్ కు చాలా బాగా తెలుసట
X
యుద్ధం ఎవరి మీద చేయాలన్న దానిపై స్పష్టత ఉంటే సరిపోదు. యుద్ధం అంతిమ లక్ష్యం విజయం మాత్రమే. అలాంటప్పుడు యుద్ధాన్ని ఎవరి మీద ఎలా చేయాలన్న దానికి పక్కా వ్యూహం అవసరం. గెలుపు కోసం అవసరమైతే ప్రత్యర్థి వర్గాలకు చెందిన వారిని సైతం తమ వైపు తిప్పుకునేలా చేయాల్సిన తెలివి చాలా ముఖ్యం. అందులోనూ రాజకీయ యుద్ధం చేసేటప్పుడు సమకూర్చుకోవాల్సిన అస్త్ర శస్త్రాల్లో సమయానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన తెలివి చాలా ముఖ్యం. ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు టన్నుల కొద్దీ ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

గడిచిన కొంతకాలంగా ప్రభుత్వం ఏదైనా సరే.. దానికి అనుకూలంగా ఉండే మీడియా సంస్థలు.. ప్రతికూలంగా పని చేసే మీడియా సంస్థలు ఉండటం సాధారణంగా మారింది. మామూలుగా అయితే మీడియా సంస్థలు ఏవైనా సరే.. స్టాండ్ తీసుకోకుండా న్యూట్రల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో అదెంతవరకు సాధ్యమన్నది చాలామందికి తెలిసిందే. అందుకే.. ప్రభుత్వాలు సైతం తమకు అనుకూలంగా ఉండే మీడియా సంస్థలను ప్రోత్సహిస్తూ.. వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఉండటం కనిపిస్తుంది. అదే సమయంలో తమకు వైరిపక్షంలో ఉండే మీడియా సంస్థలను ఎప్పుడెలా తొక్కేయాలన్నట్లుగా పావులు కదుపుతుంటుంది.

ఇలాంటి తీరుకు కాస్తంత భిన్నంగా కనిపిస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకు కొన్ని మీడియా సంస్థలతో పంచాయితీలు ఉన్న మాట వాస్తవం. ఆ విషయాన్ని ఆయనేమీ దాచి పెట్టుకోరు. అయితే.. పంచాయితీ పంచాయితీనే.. మిగిలిన లెక్కలు లెక్కలే అన్నట్లుగా వ్యవహరిస్తారు. దేన్నీ తెగే వరకు లాగకూడదన్న సూత్రాన్ని పక్కాగా పాటించే విషయంలో కేసీఆర్ తీరు చూస్తే.. ముచ్చటేయక మానదు. ముందే చెప్పినట్లు యుద్ధం దేని మీద విజయం కోసమన్న దాని మీద కేసీఆర్ కు ఉన్నంత క్లారిటీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉండి ఉంటే.. పరిస్థితులు మరోలా ఉండేవన్న వాదన వినిపిస్తూ ఉంటుంది.

తెలంగాణ అధికార పక్షానికి వ్యతిరేకంగా.. వారిని విమర్శించేలా.. వారికి చురుకుపుట్టేలా.. కొన్నిసార్లు మంట పుట్టేలా చేసే మీడియా సంస్థలు కొన్ని లేకపోలేవు. నిజానికి మీడియా అన్నది ప్రతిపక్షపాత్ర పోషించాలన్న ప్రాథమిక సూత్రాన్ని కొన్ని మీడియా సంస్థలు మర్చిపోవటంతో పాలక పక్షాలకు విమర్శ అన్నది ఇప్పుడో పెద్ద బూతుగా మారింది. మిగిలిన సందర్భాల్లో తమకు వ్యతిరేకంగా ఉండే వారిని.. తప్పులు వేలెత్తి చూపించే వారి విషయంలో కేసీఆర్ కఠినంగా ఉంటారు. కానీ.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు.

పంద్రాగస్టు సందర్భంగా మీడియాసంస్థలకు ఇచ్చిన జాకెట్ యాడ్లను చూస్తే.. తనకు అనుకూలంగా ఉండే వారికి మాత్రమే కాదు.. వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలకు సైతం ఇచ్చేయటం ద్వారా సమన్యాయాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా వ్యవహరిస్తారు. అలా అని అన్ని సందర్భాల్లో ఆయన ఉండరు. ఇప్పుడంటే మునుగోడు ఉప ఎన్నిక ఉన్ననేపథ్యంలో..తనకు వ్యతిరేకంగా పని చేస్తుందని ఆరోపించే మీడియా సంస్థకు సైతం ఖరీదైన జాకెట్ యాడ్ ఇవ్వటం కనిపిస్తోంది. దీంతోనే మొత్తంగా మారిపోదు కానీ.. జాకెట్ యాడ్ కారణంగా వచ్చే ఆదాయం విషయంలో తనకు వ్యతిరేకంగా పని చేసే మీడియా సంస్థలు సైతం కాసింత తమ దూకుడు తగ్గించి.. న్యూట్రల్ గా వ్యవహరిద్దామన్న భావన కలిగేలా చేస్తారు. అదే సమయంలో తనకు పూర్తిగా సానుకూల వాతావరణం ఉన్న వేళలో.. మిగిలిన వారికి జాకెట్ యాడ్లు ఇచ్చే కేసీఆర్.. ఆ సందర్భంలో మాత్రం తనకు వ్యతిరేకంగా వ్యవహరించే మీడియా సంస్థలకు కాల్చి వాత పెట్టేస్తుంటారు.

అంటే.. ఎప్పుడూ ఒకేలా కాకుండా.. కొన్నిసార్లు షాకులు ఇస్తూ.. మరికొన్ని సార్లు సర్ ప్రైజులు ఇస్తూ.. తాను కోరుకున్నది కోరుకున్నట్లుగా కాకున్నా.. కొంత తేడాతో పొందే లక్షణం ఆయనలో కనిపిస్తుంటుంది. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అలాంటి తీరు కనిపించదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తన వ్యతిరేకుల్ని అప్పుడప్పుడు జాకెట్ యాడ్ తో కొట్టేసి.. వారిని తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేసే కేసీఆర్ తీరుకు భిన్నంగా జగన్ తీరు ఉంటుందని చెబుతారు. ఏమైనా ఫర్లేదు.. దెబ్బలు తగిలినా తిందాం.. మనం మాత్రం వేసే దెబ్బల్ని మాత్రం ఆపొద్దన్నట్లుగా వ్యవహరించటంతో విషయం మరింత సీరియస్ గా మారి.. ముఖాముఖి పోరుకు దారి తీస్తుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. మీడియా సంస్థలకు కాసులు కురిపించే జాకెట్ యాడ్లను వాడే విషయంలో కేసీఆర్ ప్రదర్శించే నేర్పును ఏపీ సీఎం జగన్ కాసింత చూపించినా.. పరిస్థితులు ఇప్పటి మాదిరి మాత్రం ఉండేవి కాదన్న మాట వినిపిస్తూ ఉంటుంది.