Begin typing your search above and press return to search.

స్వోత్క‌ర్ష‌.. ప‌ర‌నింద‌లే.. సీఎం జ‌గ‌న్ రైతు భ‌రోసా ఓ వింత‌!

By:  Tupaki Desk   |   16 May 2022 7:28 AM GMT
స్వోత్క‌ర్ష‌.. ప‌ర‌నింద‌లే.. సీఎం జ‌గ‌న్ రైతు భ‌రోసా ఓ వింత‌!
X
వైఎస్సార్ రైతు భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని ఏడాది తొలి విడ‌త ప్రారంభించిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. ఈ సంద‌ర్భంగా చేసిన ప్ర‌సంగంలో ఆద్యంత స్కోత్క‌ర్ష‌.. ప‌ర‌నింద‌ల‌కే ప్రాధాన్యం ఇచ్చారు. గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. కొన్ని మీడియా సంస్థ‌ల‌పై ఆయ‌న య‌థావిధిగా విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతులకు ఏటా రూ.13,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోందని సీఎం జగన్‌ అన్నారు.

మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో మిగిలిన రూ.2వేలు చొప్పున జమ చేస్తుమన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు జమ చేశామన్నారు. ఎన్నడూలేని విధంగా మూడేళ్లలో రైతులకు లక్షా 10వేల కోట్లు ఇచ్చామన్నారు. ఈ రోజు రూ.5,500 నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం అన్నారు.

ఖరీఫ్‌ పనులు మొదలు కాక మునుపే వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్ర‌జ‌ల‌ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేలండర్‌ ఇచ్చి క్రమం తప్పకుండా వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామన్నారు.

వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా కింద 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దక్కుతుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టి.. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ముంగిటకే ఎరువులు, విత్తనాలు వంటి సంబంధిత సేవలను తీసుకొచ్చారన్నారు.

రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని నమ్మిన వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని వైఎస్సార్‌సీపీ గణపవరం ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు కావాల్సిన విత్తనాలు నుంచి అమ్మకాల వరకు అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందన్నారు. సీఎం జగన్‌ పాలనలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.

రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందర్శించారు. వ్యవసాయ పంటలు, దిగుబడులు గురించి ముఖ్యమంత్రికి రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు.