Begin typing your search above and press return to search.

పేద‌లకు ఇళ్ల‌`కు మించిన ప‌థ‌కం.. జ‌నాలు ఫిదా అవుతున్నారే!

By:  Tupaki Desk   |   21 April 2021 2:30 PM GMT
పేద‌లకు ఇళ్ల‌`కు మించిన ప‌థ‌కం.. జ‌నాలు ఫిదా అవుతున్నారే!
X
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకోవ‌డంలో అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు పేద‌లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వ‌ర్గాల‌కు ఆయ‌న వ‌రాలు ప్ర‌క‌టించారు. సంక్షేమ కార్య‌క్ర‌మాలు కూడా అమ‌లు చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు కేవ‌లం వారితోనే తిరిగి అధికారంలోకి రావ‌డం క‌ష్ట‌మ‌నుకున్నారో.. ఏమో.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌హా జ‌నాన్ని సైతం త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలో మ‌ధ్య త‌ర‌గ‌తి జీవులు ఆశ‌ప‌డే.. ఇళ్ల‌పై జ‌గ‌న్ కాన్స‌న్‌ట్రేట్ చేశారు.

పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి ప్రజల కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్ల పేరిట ఎం.ఐ.జి. లేఅవుట్ల ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇది వ‌చ్చే ఏడాది మొద‌ట్లో ప్రారంభించ‌నున్నారు. ఈ ప‌థ‌కం కింద‌.. లాభ న‌ష్టాలు లేని విధంగా స్థ‌లాను మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు విక్ర‌యించ‌నున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు ఇబ్బందిగా ఉన్న రియ‌ల్ బెడ‌ద‌(మోసం చేస్తార‌నే భావ‌న‌) లేకుండా.. చ‌క్క‌టి స్థ‌లం ద‌క్కుతుంద‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ద‌రు ఆలోచ‌న‌కు శ్రీకారం చుట్టినా.. ప్ర‌జ‌ల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.

ఆన్‌లైన్‌లో నిర్వ‌హించిన స‌ర్వేలో.. జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ల కు 3.79 లక్షలమందికిపైగా ఆసక్తిని కనబరచారు. సకల వసతులు, మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామంటున్న ఈ ప్రతిపాదిత లేఅవుట్లలోని ప్లాట్లను లాభనష్టాల్లేని ప్రాతిపదికన విక్రయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కొంతకాలం క్రితం ప్రకటించారు. ఆ వెంటనే సదరు లేఅవుట్ల పట్ల ఎందరు ఆసక్తితో ఉన్నారనేది తెలుసుకుని, తదనుగుణంగా ఆయా నగరాలు, పట్టణాల్లో వాటిని అభివృద్ధి చేసే ఉద్దేశంతో పురపాలక శాఖ, పట్టణ ప్రణాళిక శాఖలు డిమాండ్ అసెస్‌మెంట్‌ సర్వేను ఈ నెలారంభం నుంచి చేపట్టాయి.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మొత్తం 3,79,147 మంది ఎం.ఐ.జి. లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల కొనుగోలుకు సుముఖంగా ఉన్నారని వెల్లడైంది. మూడు పరిమాణాల్లో (150 చదరపు గజాలు, 200 చ.గ, 240 చ.గ.) ప్లాట్లుండే ఈ లేవుట్లలో 150 చ.గ. ఇళ్ల స్థలాలపై 1,19,845 మంది, 200 చ.గ. ప్లాట్లపై 1,31,233 మంది, 240 చ.గ. ఇళ్ల స్థలాలపై 1,28,069 మంది ఆసక్తిని వ్యక్తీకరించారు. మూడు కేటగిరీలను కలిపి చూస్తే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విశాఖపట్నంలో అత్యధికంగా 85.541 మంది ఎం.ఐ.జి. లేఅవుట్ల పట్ల ఆసక్తిని ప్రదర్శించారు.

ఇక‌, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 17,418 మంది మాత్రమే సానుకూలంగా స్పందించారు. సంఖ్యాపరంగా చూస్తే.. విశాఖపట్నం జిల్లా తర్వాతి స్థానాల్లో తూర్పు గోదావరి, కర్నూలు, అనంతపురం, కృష్ణా, కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలు నిలిచాయి. మొత్తంగా ఇది కూడా పేద‌ల‌కు ఇళ్ల మాదిరే అయిన‌ప్ప‌టికీ మ‌ధ్య‌త‌ర‌గ‌తికి స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే ఇళ్లు చేకూరుతుండ‌డం జ‌గ‌న్‌కు ప్ల‌స్ కానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.