Begin typing your search above and press return to search.

గవర్నర్ తో జగన్.. కీలక సమావేశం

By:  Tupaki Desk   |   18 Nov 2019 11:02 AM GMT
గవర్నర్ తో జగన్.. కీలక సమావేశం
X
ఏపీ సీఎం జగన్ దంపతులు తాజాగా ఏపీ గవర్నర్ బీబీ హరిచందన్ దంపతులతో లంచ్ విందు చేశారు. సీఎం జగన్ సోమవారం గవర్నర్ ను కలవడానికి అపాయింట్ మెంట్ కోరగానే బీబీ హరిచందన్ స్పందించారు. వెంటనే సతీసమేతంగా తమ ఇంటికి విందుకు రావాలని గవర్నర్ ఆహ్వానించారు.

సీఎం జగన్ తాజాగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వివాదాలు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి గవర్నర్ కు వివరించినట్లు తెలిసింది. ఏపీలో మతపరమైన వివాదాలు చెలరేగడంతో దానిపై గవర్నర్ కు జగన్ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. కొంత మంది ఉద్దేశపూర్వకంగా మత పరమైన విషయాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని జగన్ వివరించినట్లు తెలిసింది. ఇక వాటికి సాక్ష్యాలు కూడా జగన్ నివేదిక రూపంలో సమర్పించినట్లు తెలిసింది.

ఇక గవర్నర్ పర్యవేక్షణలో ఉండే పలు యూనివర్సిటీలు, ఏపీపీఎస్సీ చైర్మన్ వ్యవహారంపై కూడా చర్చించినట్లు సమాచారం. యూనివర్సిటీ చాన్స్ లర్ లా పాలక మండళ్ల మార్పు, కొత్త వారి నియామకంపై చర్చించినట్లు తెలిసింది. ఏపీపీఎస్సీ కమిషనర్ గా పీఎస్సార్ ఆంజనేయులు నియమాకాన్ని కూడా జగన్ గవర్నర్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. చైర్మన్ మార్పుపై కూడా చర్చించినట్లు తెలిసింది.

ఈ భేటిలో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇసుక సమస్య పరిష్కారం, ఇంగ్లీష్ మీడియం చదువులపై ప్రభుత్వ ఉద్దేశాలను గవర్నర్ కు జగన్ వివరించినట్లు తెలిసింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వివరాలను ప్రస్తావించినట్లు సమాచారం.

ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ కు బిల్లులు, సభ వ్యవహారాలపై జగన్ వివరించినట్లు సమాచారం.