Begin typing your search above and press return to search.

పార్టీ వైపు చూడు జగన్... ?

By:  Tupaki Desk   |   29 July 2021 4:03 AM GMT
పార్టీ వైపు చూడు జగన్... ?
X
వైసీపీ ఒక రాజకీయ పార్టీగా చూస్తే చతికిలపడిపోయింది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక జగన్ పూర్తిగా పార్టీని మరచిపోయారు అన్న మాట ఉంది. జగన్ ఎంతసేపూ ముఖ్యమంత్రిగానే బిజీగా ఉంటున్నారు తప్ప వైసీపీ అధినేతగా ఆయన కనీసంగా కూడా పార్టీకి సమయం కేటాయించడంలేదు అన్నది ప్రధానమైన ఆరోపణ. ఒక రాజకీయ పార్టీ మనుగడలో ఉండాలి అంటే ఎప్పటికపుడు సమావేశాలు నిర్వహించాలి. క్యాడర్ ని గుర్తించి పార్టీ పదవులు ఇవ్వాలి. కనీసం రెండేళ్ళకు ఒకసారి అయినా పార్టీ మహాజన సభ నిర్వహించాలి. కానీ ఇవేమీ వైసీపీలో ఉన్నట్లుగా కనిపించవు. టీడీపీ గురించి ఆలోచిస్తే గెలిచినా ఓడినా కూడా ఆ పార్టీ మహానాడుని ఖ‌చ్చితంగా నిర్వహిస్తూ వస్తుంది.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా మహానాడుని నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. క్యాడర్ కి దిశా నిర్దేశం చేశారు. పార్టీ పదవులను వందలాదిగా పంచి కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చారు. పార్టీ అధికార‌ప‌క్షంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా కూడా పార్టీ మ‌హానాడును మాత్రం క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హిస్తూ పార్టీ విధివిధానాలు, లోటుపాట్ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించుకుంటూనే ఉంది. ఇక వైసీపీలో పార్టీ పదవులు ఎవరికి ఇచ్చారు. వాటి కాలపరిమితి ఎంత మళ్లీ కొత్తగా నియమకాలు జరిపారా అంటే లేదు అనే చెప్పాలి. అంతవరకూ ఎందుకు పార్టీ మహాజన సభ కూడా ఇప్పటికి నాలుగేళ్ళు అయింది కానీ కొత్తగా జరపనేలేదు.

చివరిసారిగా వైసీపీ ప్లీనర్ 2017లో జరిగింది. ఆ ప్లీనరీలోనే జగన్ పాదయాత్రను కూడా పార్టీ ఆమోదించింది. ఆ తరువాత ఏడాది జగన్ పాదయాత్రలో ఉండడంతో ప్లీనరీ లేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అయినా వైఎస్సార్ జయంతి వేళ ప్లీనరీ నిర్వహిస్తారు అనుకుంటే అదీ లేదు. ఇక 2020, 2021లలో కరోనా పేరిట వాయిదా వేశారు. మొత్తానికి పార్టీలో సభలు లేవు, సమావేశాలు లేవు. పదవులు లేవు, పార్టీ అతీ గతీ గురించి చర్చించే వారు లేరు. ఇక పార్టీకి ఉన్న కార్యవర్గం ఏంటి, అందులో ఎవరు ఉన్నారు అన్నది బహుశా జగన్ కి అయినా తెలుసా అన్నట్లుగానే సెటైర్లు పడుతున్నాయి.

ఏ పార్టీ అయినా సక్రమంగా ఉంటేనే అధికారంలోకి వస్తుంది. పార్టీని పడుక్కోబెట్టేస్తే ఈ రోజుకు బాగానే ఉంటుంది కానీ ఎన్నికల వేళ క్యాడర్ సహయం లేకపోతే దారుణమైన ఫలితాలే చవిచూడాల్సి వస్తుందని గత చరిత్ర నిరూపిస్తోంది. మరి ఈ రోజుకీ వైసీపీ మేలుకోకపోతే మాత్రం ఆ పార్టీకి ముందున్నవి ముప్పు రోజులే అని చెప్పకతప్పదేమో..!