Begin typing your search above and press return to search.

కొత్త చేరికలు షురూ..మోదీ కేబినెట్ లో జేడీయూ - అన్నాడీఎంకే

By:  Tupaki Desk   |   22 May 2019 5:16 PM GMT
కొత్త చేరికలు షురూ..మోదీ కేబినెట్ లో జేడీయూ - అన్నాడీఎంకే
X
సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చాయి. ఈ నెల 19తోనే ఏడు విడతల పోలింగ్ ముగియగా... రేపు ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే పోలింగ్ ముగిసీ ముగియగానే... వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మరోమారు కేంద్రంలో మోదీ సర్కారే కొలువుదీరనుందని తేలిపోయింది. ఏ ఒక్క సర్వే కూడా ఈ మాటను కాదని ఫలితాలను వెల్లడి చేయలేదు. ఫలితంగా ఎన్డీఏలో ఫుల్ జోష్ కనిపించగా... యూపీఏ శిబిరంలో మాత్రం నైరాశ్యం అలముకుందతి. మొత్తంగా కేంద్రంలో మరోమారు మోదీ సర్కారు కొలువుదీరడం ఖాయమనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాల్లో పలు కీలక పార్టీలు తమదైన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ అటు అన్నాడీఎంకే గానీ - అటు జేడీయూ గానీ మోదీ కేబినెట్ లో చేరలేదు. కూటమిలో ఉన్నా... కేబినెట్ లో చేరకుండా బయటి నుంచే మద్దతు తెలుపుతున్నాయి. అయితే మరోమారు కూడా మోదీనే ప్రధాని కానుండటంతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు తమ వ్యూహాలను పూర్తిగా మార్చేశాయి. అంతేకాకుండా ఇప్పటికే మోదీ కేబినెట్ లో భాగస్వాములుగా ఉన్న పార్టీల కంటే కూడా దూకుడు ప్రదర్శిస్తున్న ఈ రెండు పార్టీలు... కొత్తగా కొలువుదీరనున్న మోదీ కొత్త కేబినెట్ లో ఇప్పటికే బెర్తులు కూడా ఖాయం చేసుకున్నాయట. ఈ మేరకు నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన విందుకు హాజరైన జేడీఎస్ చీఫ్ - బీహార్ సీఎం నితీశ్ కుమార్ - అన్నాడీఎంకే కీలక నేత - తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు... మోదీ కేబినెట్ చేరుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పోరాడి మరీ విజయం సాధించిన జేడీఎస్ ఆ తర్వాత ఎన్డీఏకు దగ్గరగా జరిగింది. ఈ సారి ఏకంగా మోదీ కేబినెట్ లో చేరేందుకు కూడా ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చూస్తుంటే... కేంద్ర కేబినెట్ లోనూ జేడీయూ కీలక భూమిక పోషించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక జయలలిత మరణం తర్వాత బీజేపీకి చాలా దగ్గరగా జరగక తప్పని అన్నాడీఎంకే... మోదీ కేబినెట్ చేరే విషయంలో మాత్రం అంత సుముఖంగా కనిపించలేదు. అయితే రెండో దఫా మోదీ పీఎం కానున్న నేపథ్యంలో ఇక కేంద్ర కేబినెట్ లోనూ తమ ప్రాతినిధ్యం తప్పదన్న భావనకు ఆ పార్టీ వచ్చినట్లుగా తెలుస్తోంది.