Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జేడీ లక్ష్మీనారాయణ హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   23 Jan 2023 4:28 PM GMT
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జేడీ లక్ష్మీనారాయణ హాట్‌ కామెంట్స్‌!
X
2019 ఎన్నికల ముందు మహారాష్ట్ర కేడర్‌లో ఐపీఎస్‌ అధికారిగా ఉన్న వీవీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంధ పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచారు. 2,88,874 ఓట్లు సాదించారు. మొత్తం ఆయనకు 23 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలయ్యాక పవన్‌ కల్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకోవడాన్ని అంగీకరించలేక జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.

ఆ తర్వాత టీడీపీలో, వైఎస్సార్‌సీపీలో, బీజేపీలో ఇలా పలు పార్టీలు ఆయనకు ఆహ్వానం పలికాయని.. ఆ పార్టీల్లో చేరనున్నారని పలు వార్తలు వచ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు.

ప్రస్తుతం లక్ష్మీనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో కొంత భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి సాగు చేస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల ఆహ్వానం మేరకు వాటిని సందర్శిస్తున్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ విశాఖపట్నం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. జనసేనలోనే ఆయన చేరే అవకాశం ఉందని అంటున్నారు. లక్ష్మీనారాయణ సైతం కాపు సామాజికవర్గానికి చెందినవారే.

వైసీపీ అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో జగన్‌ను హైదరాబాద్‌లో విచారించింది జేడీ లక్ష్మీనారాయణే కావడం గమనార్హం. అప్పుడు సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా లక్ష్మీనారాయణ వ్యవహరించారు.

కాగా వివిధ టీవీ చానెళ్లకు, యూట్యూబ్‌ చానెళ్లకు ఇటీవల కాలంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మీడియా సంస్థతో మాట్లాడిన లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తుంటుందని ఎక్కడా చెప్పలేదన్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే వైఎస్సార్‌సీపీపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని చెప్పారు.

టీడీపీ–జనసేన మధ్య పొత్తు కుదిరితే సీట్ల పంపకాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉందన్నారు. అలాగే సమీకరణాలు ఎలా మారతాయన్నది కూడా ముఖ్యమేనన్నారు. పరిపాలించడానికి ప్రజలు ఐదేళ్ల కాలానికి అధికారం ఇచ్చారని, పాలించలేమని భావిస్తే చేతులు ఎత్తేయాలన్నారు. అంతేకానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు.

విశాఖపట్నం నుంచి మరోసారి తాను పోటీ చేస్తానని తెలిపారు. తన భావాలకు, ఆలోచనలకు తగినట్లుగా ఉండే పార్టీని ఎంపిక చేసుకుంటానని వెల్లడించారు. తనకు ఏ పార్టీ నచ్చకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానని స్పష్టం చేశారు.

పవన్‌ కల్యాణ్‌ పై సినీ నటుడు అలీ పోటీ చేస్తానంటున్నారని.. ఈ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా ఇలాంటి వాటిని ప్రచారంలో పెట్టి రాష్ట్రంలో ఉన్న అసలు సమస్యలను పార్టీలు పక్కదారి పట్టిస్తున్నాయని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి గురించి, నిరుద్యోగం గురించి ఎవరూ మాట్లాడకుండా.. వాటిని పక్కదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగానే అలీ పోటీ చేస్తారు అంటూ ఇలాంటి వార్తలను ప్రచారంలో పెడుతున్నారని చెప్పారు. ప్రధాన విషయాలను పక్కదారి పట్టించడానికి ఇది కూడా ఒక స్ట్రాటజీ కావొచ్చన్నారు.

ప్రతి పార్టీకి అనుబంధంగా బలమైన సోషల్‌ మీడియా విభాగాలు ఉన్నాయని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. వీటిని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి అంశాలతోనే ప్రజల్ని బిజీగా ఉంచుతున్నారని హాట్‌ కామెంట్స్‌ చేశారు. అలీ పవన్‌ కల్యాణ్‌ పై పోటీచేయవచ్చని, పార్టీ ఆదేశిస్తే పోటీచేస్తారని, అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదన్నారు. తనను కూడా ఒకవేళ తన పార్టీ అధిష్టానం ఫలానా చోట పోటీ చేయాలని కోరితే పోటీ చేయకతప్పదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదని, అవి చేసేవారి స్థాయిని దిగజారుస్తాయని లక్ష్మీనారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు, ప్రజల సమస్యల గురించే మాట్లాడాలని కోరారు.

తన పేరు ముందు ఉండే జేడీ అంటే జనతా దోస్త్‌ అనే అర్థం కూడా వస్తుందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా తమ ఫౌండేషన్‌కు జాయింట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అని పేరు పెట్టినట్లు తెలిపారు.

ఇక నారా లోకేష్‌ పాదయాత్రపై జేడీ తనదైన శైలిలో స్పందించారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు, జగన్, షర్మిల కూడా పాదయాత్రలు చేశారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు తెలియడం రాజకీయ నేతలకు ముఖ్యమన్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.