Begin typing your search above and press return to search.

జేసీ తో భేటీ అయిన సీఎం రమేష్ ... త్వరలోనే పార్టీ మారబోతున్నాడా ?

By:  Tupaki Desk   |   9 April 2020 6:50 AM GMT
జేసీ తో భేటీ అయిన సీఎం రమేష్ ... త్వరలోనే పార్టీ మారబోతున్నాడా ?
X
టీడీపీ మాజీ ఎంపీ, అనంతపురం జిల్లా కీలక నేత జేసీ దివాకర్ రెడ్డి , తాజాగా మరోసారి రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు. జేసీ దివాకర్ రెడ్డి త్వరలోనే పార్టీ మారతారంటూ గతంలో చాలా సార్లు వార్తలు బయటకి వచ్చాయి. కానీ , అయన టీడీపీని వీడి మరో పార్టీలోకి వెళ్ళలేదు. ఏపీ ప్రభుత్వం అయన వ్యాపారాలపై ఉక్కుపాదం మోపడం , అయన అనుచరులపై కేసులు నమోదు చేయడంతో జేసీ పార్టీ మార్పు లాంఛనమే అనుకున్నారు కానీ, అయన పార్టీ మారలేదు.

ఇకపోతే , తాజాగా మరోసారి అయన బీజేపీ వైపు చూస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం. మాజీ టీడీపీ నేత , బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తాజాగా జేసీ దివాకర్ రెడ్డి తో భేటీ కావడమే. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని వెంటబెట్టుకుని మరీ అనంతపురం జిల్లా తాడిపత్రి వెళ్లిన సీఎం రమేష్ , జూటూరులోని జేసీ దివాకర్ రెడ్డి ఫామ్ హౌస్‌ లో ముగ్గురు కలిసి సుమారుగా నాలుగు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారు ఏం మాట్లాడుకున్నారో పూర్తిగా తెలియకపోయినప్పటికీ , కూడా రాయలసీమలో బీజేపీ బలోపేతం చేయడానికి సీఎం రమేష్ దివాకర్ రెడ్డిని బిజెపిలోకి ఆహ్వానించారనే చర్చ జరుగుతుంది. అయితే , సీఎం రమేష్ , జేసీ దివాకర్ రెడ్డి మంచి స్నేహితులు కాబట్టి ..ఆ స్నేహ బంధంతోనే ఇద్దరు కలిసారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి.

ఈ భేటీ తర్వాత జేసీ దివాకర్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన వివిధ రకాల పంటలను ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు పరిశీలించారు. అలాగే ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి,వ్యవసాయ రంగం గురించి చర్చించారని తెలుస్తుంది. అయితే , ఈ భేటీకి సీఎం రమేష్ , బీటెక్ రవిని కూడా పిలుచుకొని వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఇదే టీడీపీలోనూ హాట్‌ టాపిక్ అవుతోంది. అయితే జేసీని ఈ ఇద్దరు ఒకేసారి వచ్చి కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని.. పార్టీలు వేరైనా వారి మధ్య ఉన్న స్నేహం కారణంగానే సరదాగా వచ్చి వెళ్లారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే , ఈ భేటీ వెనుక ఉన్న మర్మం ఏమిటో ఆ ముగ్గురికే తెలియాలి. అయితే , ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ..జేసీ బీజేపీలోకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నాడనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కాగా , ఈ ముగ్గురు గతంలో తెలుగు దేశం పార్టీలో కలిసి పనిచేశారు.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం రమేష్ టీడీపీ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీటెక్ రవి, జేసీలు మాత్రం పార్టీలో కొనసాగుతున్నారు.