Begin typing your search above and press return to search.

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కారు నడిపినా నేరం కాదు.. కేంద్రం

By:  Tupaki Desk   |   12 Feb 2022 11:35 AM GMT
ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కారు నడిపినా నేరం కాదు.. కేంద్రం
X
ప్రపంచ యుద్ధాల్లో చనిపోయినవారి కంటే.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారే అధికం. ఇవీ నిపుణులు ఎప్పుడూ చెప్పే గణాంకాలు. ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయే కానీ, తగ్గడం లేదు. విషాదమేమంటే.. రెండు భారీ వాహనాలు, ఓ చిన్న వాహనం, ఓ పెద్ద వాహనం ఢీకొని గతంలో మరణాలు సంభవించేవి.

ఇప్పుడు మాత్రం రెండు చిన్న వాహనాలు ఢీకొని కూడా చనిపోతున్నారు. తెలంగాణలో నిన్న రెండు బైక్ లు ఢీకొని నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనే దీనికి ఉదాహరణ. కాగా, ఇలాంటివారిలో అధికం శాతం యువతే. దీనికితోడు సెల్ ఫోన్లు వచ్చాక ప్రమాదాలకు అవి కూడా కారణం అవుతున్నాయి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేసి

వారు ప్రాణాలు కోల్పోవడమే కాక ఎదుటివారి ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెల్ ఫోన్ డ్రైవింగ్ కు జరిమానాలు ప్రకటించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇందులో కొన్ని మార్పులు చేసింది. డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కితే చలాన్లు, జరిమానాలు తప్పవు. అయితే త్వరలో ఫోన్‌ మాట్లాడుతూ కారు నడిపితే నేరం కాదట. స్వయంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంట్‌ వేదికగా ఈ విషయాన్ని

వెల్లడించారు. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. మొబైల్‌ను నేరుగా చేతితో పట్టుకోకుండా ఇయర్‌ఫోన్స్‌ ద్వారా ఫోన్‌ మాట్లాడితే దాన్ని నేరంగా పరిగణించకూడదని గడ్కరీ అన్నారు. ఇటీవల లోక్‌సభలో మాట్లాడుతూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘‘ఇకపై కారు నడిపే డ్రైవర్‌ హ్యాండ్‌ ఫ్రీ డివైజ్‌లను (బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌) ఉపయోగించి ఫోన్లో మాట్లాడితే అప్పుడు దాన్ని నేరంగా పరిగణించలేం.

అయితే అప్పుడు ఫోన్‌ కార్లో పెట్టకుండా డ్రైవర్‌ జేబులో పెట్టుకోవాలి. దీనికి ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేయకూడదు. ఒకవేళ ఎవరైనా జరిమానా విధిస్తే.. దాన్ని కోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉంటుంది’’ అని గడ్కరీ

తెలిపారు. అయితే మొబైల్‌ నేరుగా చేతిలో పట్టుకుని ఫోన్‌ మాట్లాడితే మాత్రం ట్రాఫిక్‌ పోలీసులు చలాన్లు వేయొచ్చని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వాహనదారులకు కాస్త ఊరటనిచ్చే వార్తే

అయినప్పటికీ.. కొందరు దీన్ని అలుసుగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదు. ఫోన్‌ మాట్లాడుతున్నామని చెబుతూనే.. చెవిలో బ్లూటూత్‌ వంటివి పెట్టుకుని పాటలు వింటూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తే ప్రమాదం బారిన పడే అవకాశముందని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.