Begin typing your search above and press return to search.

జగన్ మీ నాన్న అంతరాత్మకు టికెట్ ఇస్తావా?

By:  Tupaki Desk   |   27 Feb 2020 8:30 PM GMT
జగన్ మీ నాన్న అంతరాత్మకు టికెట్ ఇస్తావా?
X
ఏప్రిలలో భారీగా రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలకు ఎన్నికల ప్రకటన కూడా విడుదలైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో దేశంలోనూ ఈ రాజ్యసభ ఎన్నికలపై ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ రాజ్యసభ స్థానాలు కోల్పోతున్న వారిలో అగ్ర నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో, బీజేపీ, టీఆర్ఎస్ లోని కీలక నాయకులు వారు. అయితే వీరిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న వారిలో ముఖ్యమైన వారు ఉన్నారు. వారే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నాయకులు కేవీపీ రామచంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి. వీరిద్దరి రాజ్యసభ స్థానాలు త్వరలోనే ఖాళీ కానున్నాయి.

వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. వారు రాజ్యసభకు వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు వారు తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఎటు చూసినా లేదు. అయితే వైఎస్సార్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క కేవీపీకి అవకాశం ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడు, సన్నిహితుడు కేవీపీ. అప్పట్లో వైఎస్సార్ అంతరాత్మగా అందరూ కేవీపీని భావించేవారు. వైఎస్సార్ కూడా కేవీపీ విశేష ప్రాధాన్యమిచ్చేవాడు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో, కీలక సమయాల్లో కేవీపీ తోడు ఉండేవారు. అతడి అభిప్రాయం తీసుకునే వారు. పలు సందర్భాల్లో తనకు ఏదైనా చెప్పాల్సి ఉంది అంటే కేవీపీకి చెప్పండి అని బహిరంగంగా వైఎస్సార్ తెలిపారు. అంతటి అనుబంధం వారిది.

ఆ క్రమంలోనే వైఎస్సార్ అకాల మరణంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. వైఎస్సార్ కుమారుడు కాంగ్రెస్ ను వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే జగన్ పార్టీ పెట్టినప్పుడు అందరూ కేవీపీ కూడా వెళ్తారని భావించారు. అలా కాకుండా కేవీపీ నమ్మిన పార్టీలోనే ఉన్నారు. ఏనాడు ఇతర పార్టీలోకి వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. ఆ తర్వాత ఆయన రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయి లో యాక్టివ్ గా ఉన్నారు. పార్టీని నమ్ముకుని ఆయన జీవిస్తున్నారు. ఆ విధంగా ఆయనకు అప్పట్లో రాజ్యసభ స్థానం వచ్చింది. తాజాగా ఆయన పదవీకాలం ముగుస్తోంది. ఈసారి మళ్లీ ఎన్నికయ్యే అవకాశం కనిపించలేదు. అయితే వైఎస్సార్ అంతరాత్మగా పేరొందిన కేవీపీని జగన్ తన తండ్రితో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంటే వైఎస్సార్సీపీ తరఫున మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయి.


ఎందుకంటే నమ్ముకున్న వారిని ఎప్పుడు వమ్ము చేయలేదనే చరిత్ర వైఎస్సార్ కుటుంబానికి ఉంది. ఈ నేపథ్యంలో జగన్ తన తండ్రి కోసమైనా కేవీపీ రాజ్యసభకు పంపించే పరిస్థితులు ఉన్నాయని పుకార్లు సాగుతున్నాయి. ఒకవేళ జగన్ ఇచ్చినా కేవీపీ తీసుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కేవీపీ ఏనాడు పదవుల కోసం వెంపర్లాడలేదు. అప్పట్లో జగన్ వెంట కేవీపీ వెళ్తారని అనుకోగా.. జగన్ ను పార్టీ వీడొద్దని చెప్పారే తప్ప ఆయన పార్టీ నుంచి బయటకు రాలేదు. ఆ విధంగా కాంగ్రెస్ కు వీరబంటుగా కేవీపీ ఉన్నారు. మరి జగన్ టికెట్ ఇస్తే పోటీ చేసే అవకాశాలు కూడా చాలా తక్కవగా ఉన్నాయి.

ఇక మరో కీలక నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి. పారిశ్రామిక వేత్తగా కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. ఈయనకు వైఎస్సార్ తో చాలా సంబంధాలు ఉన్నాయి. ఈయన కూడా పార్టీకి వీర విధేయుడు. ప్రస్తుతం ఈయన పదవీకాలం ముగుస్తోంది. అయితే కేవీపీతో పోలిస్తే సుబ్బిరామిరెడ్డికి అవకాశం ఒక్కటీ కూడా లేదు. రాజ్యసభ స్థానం ఇవ్వాలంటే ఏపీతో, తెలంగాణలో కాంగ్రెస్ కు బలం లేదు. దీంతో వీరిద్దరూ త్వరలోనే మాజీలై రాజకీయ జీవితం ముగించే అవకాశం కనిపిస్తోంది. అంతే తప్ప వీరికి మళ్లీ రాజ్యసభ స్థానం అనేది ఊహించనిది.