Begin typing your search above and press return to search.

మహమ్మారి వేళ.. సరికొత్త ఐడియాతో ఎన్నికల సంఘం!

By:  Tupaki Desk   |   5 July 2020 7:34 AM GMT
మహమ్మారి వేళ.. సరికొత్త ఐడియాతో ఎన్నికల సంఘం!
X
వినేందుకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. కరోనా అన్నది ఇప్పట్లో ముగిసేది కాదన్న విషయాన్ని ప్రభుత్వమే కాదు.. ప్రజలు సైతం ఇప్పుడిప్పుడే అంగీకరిస్తున్నారు. అంతకు మించి అర్థం చేసుకుంటున్నారు. మహమ్మారితో సహజీవనం చేస్తూ సాగాలన్న అంశంపై ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు అర్థమవుతున్నట్లుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అందుకు మినహాయింపు కాదనే చెప్పాలి. దీర్ఘకాలం పాటు సాగే మాయదారి రోగం నేపథ్యంలో.. ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా సరికొత్త ప్లానింగ్ చేస్తోంది.

రానున్న నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో.. ఎలా చేయాలన్న అంశంపై భారీ కసరత్తులు చేయటమే కాదు.. కొన్ని ప్రతిపాదనల్ని సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించటం కష్టమవుతుందన్న విషయాన్ని గుర్తించినట్లు కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే కొన్ని ప్రాక్టికల్ సమస్యల్ని అధిగమించేందుకు సిద్ధమైంది. పాజిటివ్ వచ్చిన వారు సైతం ఎన్నికల్లో ఓటేసేందుకు వీలుగా కొన్ని ఐడియాల్ని సిద్ధం చేసింది.

మరికొద్ది నెలల్లో బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల్లోనూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి కొన్ని అంశాల్ని అమలు చేసేందుకు వీలుగా సిద్ధం చేసింది. అందులో ముఖ్యమైనవి పాజిటివ్ వచ్చిన వారు ఓటు వేసేందుకు వీలుగా ఉంటే.. ఈవీఎంను చేతి వేలితో తాకకుండా.. కర్ర ముక్కతో బటన్ నొక్కే ప్లాన్ కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. పెద్ద వయస్కులు.. పాజిటివ్ లు.. హోం క్వారంటైన్ లో ఉండేవారంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారికి ఖాదీ మాస్కులతో పాటు.. శానిటైజర్లను సిద్ధం చేయటం.. ఓటింగ్ కేంద్రాల్లో ఎక్కువమంది ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకూ ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలకు మరో 45 శాతం అదనంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే అనవసరమైన రద్దీని నివారించొచ్చని భావిస్తోంది. అంతేకాదు.. ఒక్కో పోలింగ్ స్టేషన్లో కేవలం వెయ్యి మంది ఓటర్లు ఓటు వేసేలా ప్లాన్ చేస్తోంది. ప్రాణాంతాక మహమ్మారి ఇప్పట్లో తొలిగే అవకాశం లేని నేపథ్యంలో షెడ్యూల్ కు తగ్గట్లు ఎన్నికల్ని పూర్తి చేయాలని భావిస్తోంది.