Begin typing your search above and press return to search.

ముగిసిన షర్మిల దీక్ష.. 2 ఏళ్లలో తెలంగాణ సీఎం అంట!

By:  Tupaki Desk   |   18 April 2021 10:09 AM GMT
ముగిసిన షర్మిల దీక్ష.. 2 ఏళ్లలో తెలంగాణ సీఎం అంట!
X
గత మూడు రోజులుగా ఉద్యోగాలు భర్తీ చేయాలని దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా దీక్ష విరమించారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబ సభ్యులు షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు.

ప్రస్తుతానికి దీక్ష విరమించినా జిల్లాల్లోని కార్యకర్తలు ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తారని షర్మిల తెలిపారు. ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని .. ఉద్యోగాల కోసం కేసీఆర్ సర్కార్ పై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు.

ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టిన షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో లోటస్ పాండ్ కు పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా లోటస్ పాండ్ వద్ద 72 గంటల దీక్ష చేపట్టారు. ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు, నిరుద్యోగుల సూచన మేరకు దీక్ష విరమించారు.

దీక్ష విరమించిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యలేనని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. రెండేళ్లలో తాను తెలంగాణ సీఎం అవుతానని.. నిరుద్యోగుల ఆశలు తీరుస్తానని.. రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల హామీ ఇచ్చారు.వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేటు రంగంలో కూడా లక్షల ఉద్యోగాలు కల్పించాడని గుర్తు చేశారు.