Begin typing your search above and press return to search.

అమెరికాలో మ‌నోళ్లు ఎందరున్నారో తెలిస్తే..ఆశ్చ‌ర్య‌పోతారు!

By:  Tupaki Desk   |   20 Nov 2019 8:57 AM GMT
అమెరికాలో మ‌నోళ్లు ఎందరున్నారో తెలిస్తే..ఆశ్చ‌ర్య‌పోతారు!
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో భార‌తీయులు జ‌నాభా గ‌ణ‌నీయ స్థాయికి చేరుకుతంది. అవ‌కాశాల స్వ‌ర్గ‌దామంగా పేరొందిన అమెరికాకు వెళ్లే విదేశీయుల సంఖ్య‌ ఇటీవ‌లి కాలంలో త‌గ్గిన‌ప్ప‌టికీ...భార‌తీయులు ప్ర‌ముఖ స్థానంలో ఉన్నారు. అమెరికాలోని జ‌నాభా వివ‌రాల‌ను తెలియ‌జేసే అమెరిక‌న్ క‌మ్యూనిటీ స‌ర్వే (ఏసీఎస్) ప్ర‌కారం - జూలై 1 - 2018 నాటికి అమెరికా మొత్తం జ‌నాభా 327 మిలియ‌న్లు విదేశాల్లో జ‌న్మించి అమెరికాలో ఉన్న ప్ర‌జ‌ల సంఖ్య 44.7 మిలియ‌న్లు. అంటే 13.7 శాతం విదేశీయులు అమెరికాలో ఉన్నారు. ఇటీవ‌లి కాలంలో వ‌ల‌స‌దారుల సంఖ్య 0.4% పెరిగింద‌ని తెలుస్తోంది.

ఈ గ‌ణాంకాల ప్ర‌కారం - అమెరికాలో ఉంటున్న భార‌తీయుల సంఖ్య‌లో పెద్ద ఎత్తున వృద్ధి క‌నిపించింది. 2010లో మొత్తం అమెరిక‌న్ల జ‌నాభాలో భార‌తీయుల సంఖ్య 1.8% ఉండ‌గా - 2018లో అది 2.7 శాతానికి చేరింది. అంటే 49% వృద్ధి న‌మోదైంది. ఇక‌, పొరుగున ఉన్న చైనా విష‌యానికి వ‌స్తే - 2010లో 2.2 మంది చైనీయులు అమెరికాలో సెటిల‌వ్వ‌గా 2018 నాటికి 2.9%కి చేరింది. చైనీయుల విష‌యంలో 32% వృద్ధి న‌మోదు అయింది.

మ‌రోవైపు, అమెరికాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థుల ఆకాంక్షలను అక్కడి వీసా నిబంధనలు - కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు ఎంతమాత్రం నిలువరింపజేయట్లేదు. 2018-19 సంవత్సరంలో భారత్ నుంచి 2,02,014 మంది విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించడానికి అమెరికాకు వెళ్లారు. అమెరికాకు విదేశీ విద్యార్థులను పంపే రెండో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. గత పదేండ్లుగా ఈ వరుసలో చైనా తొలి స్థానంలో(3,69,548 మంది) ఉండగా, భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) సంస్థ 2019 ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్చేంజ్ పేరిట సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాల్ని వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 2018-19 సంవత్సరంలో అత్యధిక మంది విదేశీ విద్యార్థులు(10,95,299 మంది విద్యార్థులు) అమెరికాకు చదువుకోవడానికి వచ్చినట్టు నివేదిక పేర్కొంది.

ఇక ఇటీవ‌లే విడుద‌లైన `అమెరికా సెన్సస్‌ బ్యూరో` అమెరికన్‌ కమ్యూనిటీ సర్వే వివరాల ప్రకారం.. 2018 జులై 1నాటికి అమెరికాలోని భారతీయుల్లో హిందీ మాట్లాడే వాళ్లు 8.74 లక్షల మంది ఉన్నారు. 2017 గణాంకాలతో పోలిస్తే ఇది 1.3 శాతం పెరుగుదలను నమోదుచేసింది. 2010లో పోల్చితే హిందీ 43.5 శాతం పెరుగుదలను నమోదుచేసింది. తెలుగు మాట్లాడే వారి పెరుగుదల మాత్రం గరిష్టంగా 79.5 శాతం పెరుగుదలను నమోదు చేయడం గమనార్హం. ప్రస్తుతం తెలుగు మాట్లాడే వారు 4 లక్షల మంది ఉన్నారు. బెంగాలీ మాట్లాడే జనాభా ఎనిమిదేళ్ల‌ కాలంలో 68 శాతం పెరుగుదలతో 3.75 లక్షల మంది ఉన్నారు. తమిళం మాట్లాడే వారు 67.5శాతం పెరుగుదలతో 3.08 లక్షల మంది ఉన్నారు.