Begin typing your search above and press return to search.

కుబేరా..? కాస్త ఆగు.. ఈ మూడు దేశాల జాబితాలో భారత్

By:  Tupaki Desk   |   1 July 2022 1:30 AM GMT
కుబేరా..? కాస్త ఆగు.. ఈ మూడు దేశాల జాబితాలో భారత్
X
ఏ దేశానికైనా ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. దాని పునాదులు మరింత బలంగా ఉండాలి. అంటే.. ఎలాంటి ఒడిదొడుకులు వచ్చినా తట్టుకుని నిలవగలిగేలా ఉండాలి. అలాంటి ఆర్థిక వ్యవస్థ కావాలంటే.. ముందుగా వ్యక్తులు ఆర్థికంగా సుసంపన్నులు కావాలి. అపర కుబేరులో.. కోటీశ్వరులో.. ఏ పేరిట పిలిచినా.. ఇలాంటి వ్యక్తులు కీలకం. అమెరికా ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఎదిగిందంటే దానిక్కారణం వ్యక్తులు, అక్కడి ప్రభుత్వ విధానాలు. అఖరికి ఉక్రెయిన్ పై దురాక్రమణ అనంతరం పశ్చిమ దేశాలు.. రష్యా ఒలిగార్చ్ ల(సుసంపన్నులు)నూ లక్ష్యంగా చేసుకున్నాయి అంటే.. ఆర్థిక వ్యవస్థలో వారి ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోవచ్చు.

తరలిపోతున్నారు..

ప్రభుత్వాల ఆర్థిక విధానాల లోని లోపాల వల్లనే కానీ.. విదేశాల్లోని ఆకర్షణీయ పరిస్థితుల రీత్యానే కానీ.. కుబేరులు తరలిపోతున్నారు. ఇలా సంపన్నులు వెళ్లిపోతున్న దేశాల్లో రష్యా, చైనా, భారత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి కోటీశ్వరులు వెళ్లిపోతున్నారంటే అర్థం ఉంది. కానీ, ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాలని, అమెరికాను వెనక్కు నెట్టాలని కలలుగంటున్న చైనా నుంచి కూడా కుబేరుల వలసలు కొనసాతుండడం గమనార్హం. ఇక తదుపరి స్థానలంలో భారత్ ఉండడం ఆశ్చర్యకరం. 2022 చివరికల్లా 8 వేల మంది లక్ష్మీపుత్రులు విదేశాలకు వెళ్లిపోతారని హెన్లీ ప్రైవేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ డ్యాష్‌బోర్డ్‌ అనే సంస్థ పేర్కొంటోంది. 2018 హెన్లీ గ్లోబల్‌ సిటిజన్‌ రిపోర్ట్‌’పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది.

భారత్ లో కొత్తగా పుట్టుకొస్తున్నారు

ఈ సంపన్నులను హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్గ్ (హెచ్‌ఎన్‌ఐలు) గా పేర్కొంటుంటారు. భారత్ నుంచి కూడా వీరు తరలిపోతున్నప్పటికీ.. రష్యా, చైనాతో పోలిస్తే మనదగ్గర కొత్తగా పుట్టుకొస్తుండడంతో ఆ ప్రభావం తక్కువగా ఉంది. కాగా, అంకుర సంస్థలు, లేదా వ్యాపారాభివృద్ధితో అనతికాలంలోనే ‘యూఎస్‌ డాలర్‌ మిలియనీర్లు/బిలియనీర్లు’గా అభివృద్ధి చెందే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను హెచ్‌ఎన్‌ఐగా పరిగణిస్తారు. భారత్‌లో ప్రభుత్వాల కఠిన విధానాలు, పన్ను నిబంధనలే హెచ్‌ఎన్‌ఐలు దేశాన్ని వీడేందుకు ప్రధాన కారణాలని హెన్లీ ప్రైవేట్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ డ్యాష్‌బోర్డ్‌ నివేదిక పేర్కొన్నది. టెక్‌ ఆధారిత రంగంలోని హెచ్‌ఎన్‌ఐలు కొత్తఐటీ చట్టాలు/నిబంధనలు, సోషల్‌మీడియా నియంత్రణ వల్ల రిస్క్‌లేని దేశాలవైపు చూస్తున్నట్లు తెలిపింది. పాతతరం హెచ్‌ఎన్‌ఐలు మాత్రం భారత్‌ను వీడేందుకు ఇష్టపడడం లేదని, విదేశాల్లో వ్యాపారాలను విస్తరించిన వారు కూడా భారత్‌కు తిరిగి వస్తున్నారని న్యూ వరల్డ్‌ వెల్త్‌ సంస్థ ప్రతినిధి ఆండ్రూ అమొయిల్స్‌ వెల్లడించారు. భారత్‌లో పన్ను విధానాలను 2020, 2021ల్లో మరింత కఠినంగా మార్చినట్లు అభిప్రాయపడ్డారు. భారత్‌లో స్టార్ట్‌పలు, యువ పారిశ్రామికవేత్తలకు పన్నుచెల్లింపులో వెసులుబాటులు లేవన్నారు.

ఎడారి దేశమైనా ఎగిరిపోదాం..

రష్యా, చైనా, భారత్ లను వీడుతున్న సుసంపన్నులు ఎక్కువగా వెళ్తున్నది ఎక్కడికో తెలుసా? యునైటెట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) కాదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). ఈ మాటకొస్తే హెచ్ ఎన్ ఐ లు తరలిపోతున్న టాప్ -5 దేశాల్లో కూడా భారత్ లేదు. మరి వీరు చూపు ఎడారి ఎమిరేట్స్ లో ముఖ్యంగా దుబాయ్‌ వైపు ఉంది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, సింగపూర్‌, ఇజ్రాయె ల్‌, స్విట్జర్లాండ్‌, అమెరికా ఉన్నాయి. ఈయూ దేశాలైన పోర్చుగల్‌, మాల్టా, గ్రీస్‌ వైపూ హెచ్‌ఎన్‌ఐలు చూస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది భారత్‌ నుంచి 8 వేల మంది హెచ్‌ఎన్‌ఐలు తరలి వెళ్తారని అంచనా. అయినా అది ప్రమాద ఘంటికలకు ఏమాత్రం సంకేతం కాదని హెన్లీ సంస్థ పేర్కొన్నది. 2031 కల్లా భారత్‌లో హెచ్‌ఎన్‌ఐల సంఖ్య 80శాతం పెరగనుంది. వీరి వల్ల ప్రపంచంలోనే అతి వేగంగా సంపద పెరుగుతున్న దేశంగా భారత్‌ నిలవనుంది. అమెరికాలో హెచ్‌ఎన్‌ఐల పెంపు 20శాతం మాత్రమే ఉం డనుంది. ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, బ్రిటన్‌లలో ఇది 10శాతం మేర ఉండొచ్చు. ఆయా దేశాలతో పోలిస్తే.. భారత్‌ సంపద పెరగడానికి రానున్న పదేళ్లలో హెచ్‌ఎన్‌ఐలు దోహదపడనున్నారు’’ అని హెన్లీ సంస్థ అభిప్రాయపడింది. అప్పటికల్లా భారత్‌లో పన్ను విధానం, జీవన ప్రమాణాలు, హెల్త్‌కేర్‌ మెరుగైతే హెచ్‌ఎన్‌ఐలు విదేశాల వైపు చూడటం తగ్గుతుందయని, విదేశాలకు వెళ్లిన హెచ్‌ఎన్‌ఐలు వస్తారని న్యూ వరల్డ్‌ వెల్త్‌ సంస్థ పేర్కొంది.

ఏయే దేశం నుంచి ఎంతమంది వెళ్లిపోతారంటే..
రష్యా 15,000 చైనా 12,000భారత్‌ 8,000

ఏ దేశాలకు వెళ్తున్నారంటే..
యూఏఈ 4,000 ఆస్ట్రేలియా 3,500 సింగపూర్‌ 2,800 ఇజ్రాయెల్‌ 2,500 స్విట్జర్లాండ్‌ 2,200 అమెరికా 1,500