Begin typing your search above and press return to search.

వైసీపీ గెలిచే సీట్లివి.. ఆరు చోట్ల హోరాహోరీ

By:  Tupaki Desk   |   21 May 2019 6:48 AM GMT
వైసీపీ గెలిచే సీట్లివి.. ఆరు చోట్ల హోరాహోరీ
X
ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మెజార్టీ సర్వేలు తేల్చాయి. ఇండియా టుడే కూడా కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అంచనాలతో సీట్ల లెక్కను చెప్పింది. అయితే తాజాగా మంగళవారం మరింత వివరంగా ఏపీలో వైసీపీ - టీడీపీ - జనసేన గెలిచే సీట్లపై సర్వే రిపోర్టును విడుదల చేసింది.

*18 వైసీపీ - జనసేన 1 - టీడీపీకి 6?

ఇండియా టుడే విడుదల చేసిన సర్వే ప్రకారంలో ఏపీలోని మొత్తం 25 లోక్ సభ సీట్లలో వైసీపీ 18 చోట్ల విజయం సాధిస్తుందని అంచనావేసింది. ఇక ఆరు సీట్లలో మాత్రం టీడీపీ - వైసీపీ మధ్య హోరాహోరీ ఉంటుందని తెలిపింది. ఇక జనసేన ఒక్క సీటులో విజయం సాధించే అవకాశాలున్నాయని తెలిపింది. అయితే ఏపీలో టీడీపీ గెలిచే ఎంపీ సీట్లను మాత్రం నిర్ధారించకపోవడం విశేషం. కేవలం ఆరు చోట్ల టీడీపీ - వైసీపీ హోరాహోరీలో గెలిచే అవకాశం ఉందని పేర్కొనడం విశేషం. దీన్ని బట్టి టీడీపీకి గుండు సున్నానేనా అన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

*వైసీపీ గెలిచే స్థానాలివే..

లోక్ సభ స్థానాల వారీగా చూస్తే.. కర్నూలు - నంద్యాల - బాపట్ల - ఏలూరు - అరకు - విజయనగరం - అనకాపల్లి - కాకినాడ - అమలాపురం - ఒంగోలు - నర్సాపురం - నరసారావుపేట - హిందూపూర్ - రాజంపేట - కడప - నెల్లూరు - తిరుపతి లోక్ సభ సీట్లను వైసీపీ గెలుస్తుందని ఇండియా టుడే అంచనావేసింది. ఇక మాజీ పోలీస్ అధికారి అయిన గోరంట్ల మాధవ్ పోటీచేసిన హిందూపూర్ టీడీపీకి కంచుకోట. ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుందని ఇండియా టుడే అంచనావేయడం విశేషం.

*ఆరుచోట్ల టీడీపీ-వైసీపీ హోరాహోరీ

టీడీపీకి 6 చోట్ల గెలుపు అవకాశాలున్నాయని.. అది టఫ్ ఫైట్ లోనేన్న అంచనాను ఇండియా టుడే వెలువరించింది. అక్కడ కూడా వైసీపీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడింది. ముఖ్యంగా గుంటూరు - విజయవాడ - అనంతపురం - చిత్తూరు - మచిలీపట్నం - శ్రీకాకుళంలలో టీడీపీ - వైసీపీ మధ్య హోరా హోరా ఉంటుందని ఇండియా టుడే తెలిపింది. విజయవాడ బరి మాత్రం టఫ్ ఫైట్ గా ఉంది. ఇక్కడ ఉద్దండులైన టీడీపీ నుంచి కేశినేని నాని - వైసీపీ నుంచి పీవీపీ పోటీచేస్తున్నారు. గుంటూరులో గల్లా వర్సెస్ మోదుగుల ఫైట్ ఉత్కంఠ రేపుతోంది. అనంతపురంలో కూడా జేసీ కుమారుడికి పోటీ ఉందని సర్వే తేల్చింది.

*జనసేనకు విశాఖలో ఛాన్స్

ఇక ఏపీ వ్యాప్తంగా జనసేనకు నిరాశజనకంగా ఫలితాలు వస్తాయని ఇండియా టుడే అంచనావేసింది. కానీ మాజీ సీబీఐ జేడీ పోటీచేసిన విశాఖలో మాత్రం ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. జనసేన తరుఫున గెలిచే ఒక్క ఎంపీ సీటు విశాఖ కావచ్చని.. సీబీఐ జేడీకి బాగానే ఓట్లు పడ్డాయని నివేదికలో తెలిపింది. మరి ఇండియా టుడే ఫలితాలు ఎంతవరకు నిజం అవుతాయన్నది మే 23న ఫలితాల వరకూ ఎదురుచూడాల్సిందే..