Begin typing your search above and press return to search.

ముందు ప్రియుడు తర్వాత ప్రియురాలు మృతి.. అసలేమైంది?

By:  Tupaki Desk   |   16 May 2022 5:30 PM GMT
ముందు ప్రియుడు తర్వాత ప్రియురాలు మృతి.. అసలేమైంది?
X
ప్రేమ... ఈ పేరు వినగానే ప్రతీ ఒక్కరి మదిలో ఎవరిదో ఒక రూపం మెదులుతుంది. అయితే కొంత మందికి ప్రేమ తీపిని పంచితే.. మరికొంత మందికి చేదును పంచుతుంది. అంతేనా కొందరిని ఆత్మహత్యలు, హత్యలు చేయించే వరకు తీసుకెళ్తుంది. అయితే తాజాగా... జీవితాంతం కలిసుండాలని కలలు కన్న ఓ ప్రేమ జంటను మృత్యువు విడదీసింది. అయితే ప్రేమికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులోని తుమకూరు తాలూకా ఆరేహళ్లిలో చోటు చేసుకుంది.

ఆరేహళ్లికి చెందిన సుష్మా, మస్కల్ గ్రామానికి చెందిన ధనుష్ లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరిని వదిలి ఒకరు అస్సలు ఉండలేరు. ఎలాగైనా సరే జీవితంలో మంచి స్థాయికి చేరుకొని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ముందు పెద్దలు వీరి ప్రేమను తిరస్కరించినా తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. అయితే ముహూర్తం పెట్టుకుని అనుకునే సమయంలోనే... ధనుష్ వాళ్ల ఊళ్లో జాతర వచ్చేసింది. అది కాగానే పెళ్లి నిశ్చయం చేసుకుందాం అనుకున్నారు.

ఈ నెల 11వ తేదీన గ్రామంలో జరిగే జాతర లో పాల్గొనడానికి ధనుష్ బైక్ పై వస్తుండగా... నెలమంగల దగ్గర ఉన్న కులానహళి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సుష్మ... ధనుష్ లేని లోకాన్ని ఊహించుకోలేక పోయింది. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ప్రియుడి అంత్యక్రియల్లో పాల్గొంది. ఆనాటి నుంచి తనలో తానే కుమిలిపోతూ తీవ్ర ఆవేదనకు లోనైంది.

ఇక జీవించడం వృధా అని భావించి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఆమెను కాపాడుకోవాలని సుమారు నాలుగైదు ఆస్పత్రులకు మార్చారు.

కానీ ప్రయోజనం లేదు. ఆదివారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. రెండేళ్లుగా ప్రేమించిన ప్రియుడు చనిపోతేనే తట్టుకోలేకపోయింది... 20 ఏళ్ల పాటు కని పెంచిన తాము ఏం చేసుకోవాలంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఏడుస్తుంటే... ఆపడం ఎవరి తరం కాలేదు. ప్రేమ ఉండొచ్చు... కానీ తాము ప్రేమించిన వారికి చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం సరైన నిర్ణయం కాదు.

చనిపోవడం వల్ల ఆమె తన ప్రేమను పొందలేక పోయింది... తనను ఎంతగానో ప్రేమిస్తూ పెంచుకున్న తల్లిదండ్రులను సుఖ పెట్టలేయింది. సుఖం సంగతి దేవుడు ఎరుగు కానీ... ప్రతి రోజూ కూతుర్ని తలుచుకొని ఏడ్చేలా చేసింది. తమ కూతురులా మరెవరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.