Begin typing your search above and press return to search.

టీడీడీ తీరు మారకపోతే కొత్త పార్టీ: అతిథేశ్వరానంద స్వామీజీ!

By:  Tupaki Desk   |   24 Nov 2022 7:32 AM GMT
టీడీడీ తీరు మారకపోతే కొత్త పార్టీ: అతిథేశ్వరానంద స్వామీజీ!
X
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్యాత్మిక కేంద్రంలా కాకుండా వ్యాపార కేంద్రంలా మారిందని వివిధ రాష్ట్రాలకు 30 మంది పీఠాధిపతులు తీవ్ర విమర్శలు చేశారు. వీరంతా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. అయితే వీరిని మహాద్వారం గుండా వెళ్లడానికి భద్రతా సిబ్బంది ఒప్పుకోలేదు. తమకు మీ రాక గురించి ఎలాంటి సమాచారం లేదని భద్రతా సిబ్బంది చెప్పడంతో పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ముందుగానే లేఖ ఇచ్చినప్పటికీ టీటీడీ అధికారులు ఇలా వ్యవహరించడాన్ని ఖండించారు.

తిరుమలలో వ్యాపారవేత్తలకు, రాజకీయ నేతలకు మాత్రమే స్వేచ్ఛగా దర్శనభాగ్యం కలుగుతోందని నిప్పులు చెరిగారు. తమను మహాద్వారం గుండా దర్శనానికి అనుమతించకపోవడంతో పీఠాధిపతులు అక్కడే నిరసన తెలిపారు. తిరుమలలో సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామీజీలకు, ధర్మప్రచారాలకు, హైందవ సంఘాలకు దర్శన భాగ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

అనంతరం శ్రీనివాస మంగాపురంలో పీఠాధిపతులు మీడియాతో మాట్లాడుతూ టీటీడీపై ధ్వజమెత్తారు. విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి మాట్లాడుతూ.. తిరుమలలో రాజకీయ నేతలు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శన భాగ్యం లభిస్తోందన్నారు. టీటీడీ మారకపోతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని హెచ్చరించారు.

తిరుమలలో మార్పులు జరగని పక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో కొత్త పార్టీని స్థాపిస్తామన్నారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెట్టి టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడిస్తామని చెప్పారు.

కాగా మహాద్వారం గుండా దర్శన భాగ్యం కల్పించకపోతే కొత్త పార్టీ పెడతామని సర్వస్వంగ పరిత్యాగులైన స్వామీజీలు చెప్పడమేమిటనే చర్చ నడుస్తోంది. మరోవైపు స్వామీజీలు ఆరోపించినట్టు టీటీడీలో అవినీతి వేళ్లూనుకుపోయిందని.. దర్శన టికెట్లు అమ్ముకుంటున్నారని.. డబ్బున్నవారికి, రాజకీయ నేతలకే వీఐపీ దర్శనాలు దక్కుతున్నాయని మరికొంత మంది విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్వామీజీల ఆగ్రహంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. అందులోనూ ఇటీవల కాలంలో టీటీడీ ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు ఫ్యాక్ట్‌ చెక్‌ పేరుతో వాస్తవాలను మీడియాకు వెల్లడిస్తోంది. ఈ నేపథ్యంలో 30 మంది పీఠాధిపతుల దర్శనం వ్యవహారంపై కూడా వివరణ ఇచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.