Begin typing your search above and press return to search.

ఒలంపిక్స్‌లో పీవీ సింధు దూకుడు..మరోకటి గెలిస్తే పథకం ఖాయం !

By:  Tupaki Desk   |   30 July 2021 10:34 AM GMT
ఒలంపిక్స్‌లో పీవీ సింధు దూకుడు..మరోకటి గెలిస్తే పథకం ఖాయం !
X
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. శుక్రవారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ జపాన్ కు చెందిన అకానె యామగుచి తో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో తెలుగు తేజం పీవీ సింధు 2-0 తేడాతో గెలుపుని సొంతం చేసుకుని పతకం ఆశలను సజీవంగా నిలుపుకుంది.మాజీ ప్రపంచ నంబర్ వన్ ,ప్రస్తుతం ప్రపంచంలో 5 వ స్థానంలో ఉన్న జపాన్ ప్లేయర్ యమగుచి పై సింధు మొదటి సెట్ లో పైచేయి సాధించింది.

13-21 తేడాతో పివి సింధు గెలిచింది. ఇక రెండో గేమ్ లో సింధు అకానె హోరాహోరీగా తలపడ్డారు. ఇద్దరు ప్రారంభం నుంచే ఆధిక్యం పొందడానికి ప్రయత్నించారు. అయితే సహనం కోల్పోయిన అకానె తప్పులు చేయడంతో సింధు తనదైనశైలిలో విజృంభించింది రెండో సెట్ లో సింధు, అకానె మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరకు 22-20 తేడాతో గెలుపును సొంతం చేసుకుంది సింధు. తొలిగేమ్ లో యమగూచిని బలమైన స్మాష్ లు, తెలివైన ప్లేసింగ్ లతో బెంబేలెత్తించిన సింధుకు రెండో గేమ్ లో కాస్తంత ప్రతిఘటన ఎదురైంది. అయితే, అద్భుత ఆటతీరుతో పుంజుకున్న సింధు తన ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా గేమ్ ను, తద్వారా మ్యాచ్ ను కైవసం చేసుకుంది.

ఈ క్రమంలో సెమీఫైనల్స్‌ లో అడుగుపెట్టిన పీవీ సింధు.. టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్ పతక ఆశల్ని మోస్తున్న ఏకైక షట్లర్‌‌ గా ఉంది. ఇక సెమీఫైనల్లో గెలిస్తే సింధుకు పతకం ఖాయం అవుతుంది. గతంలో వీరిద్దరూ 18 సార్లు పోటీపడగా 11-7తో సింధుదే పైచేయి. షార్ప్‌ కట్స్‌.. అక్యూరసీ షాట్స్‌.. బుల్లెట్‌లా దూసుకెళ్లే స్మాష్‌లు.. ఎదురులేని స్ట్రోక్‌లు.. ఇలా షటిల్‌పై సంపూర్ణ నియంత్రణ. మొత్తంగా ఆల్‌రౌండ్‌ విన్యాసం సింధూది. అదే ఇప్పుడు.. సింధూకి కలిసొచ్చింది. స్వర్ణ ఆశలు మోస్తున్న ఆ దిశగా అడుగులేస్తోంది.

పీవీ సింధు ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే భారత్ కు గోల్డ్ పతకం గ్యారెంటీ. ఫస్ట్ సెట్ నుంచే దూకుడుగా ఆడిన సింధు ప్రత్యర్థి ఒత్తిడి పెంచింది. తనదైన స్మాష్ షాట్లు, డ్రాప్ షాట్ల తో ప్రత్యర్ధిపై ఆది నుంచే దూకుడు కొనసాగించింది. ఫస్ట్ సెట్ ను 21-13 తో కైవసం చేసుకున్న సింధు. అదే జోరు రెండో సెట్ లోనూ కొనసాగించింది. యమగుచి వెన్ను గాయం తర్వాత మునుపటి వేగం తన ఆటలో లోపించిందని స్వయంగా ఆమే ప్రకటించింది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌ లో తీవ్రమైన ఒత్తిడి యమగుచిలో కన్పించింది. ఇక, సెమీస్ మ్యాచ్ రేపు జరగనుంది. సింధు ప్రత్యర్థి ఇంకా ఎవరో తేలలేదు.