Begin typing your search above and press return to search.

ఆ ఆరు నెల‌లు మోడీ ప‌ట్టించుకుని ఉంటే.. బెంగాల్ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   9 May 2021 9:30 AM GMT
ఆ ఆరు నెల‌లు మోడీ ప‌ట్టించుకుని ఉంటే.. బెంగాల్ సీఎం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ప్ర‌స్తుతం దేశాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి చుట్టుముట్టేసింది. రోజుకు వేల సంఖ్య‌లో క‌రోనా బాధితులు మృతి చెందుతున్నారు. అయితే.. గ‌డిచిన ఆరు మాసాల కాలంలో క‌రోనాపై కేంద్ర ప్ర‌భుత్వం దృష్టి పెట్టి ఉంటే.. ఈ ప‌రిస్థితి వ‌చ్చేదికాద‌ని.. ప‌లువురు.. శాస్త్ర‌వేత్త‌లు, వైద్య నిపుణులు చెబుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఇదే విష‌యంపై ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ఆ ఆరు మాసాలు ప్ర‌జ‌ల‌పై దృష్టి పెట్టి ఉంటే.. ప్ర‌జ‌ల ఆరోగ్యంపై శ్ర‌ద్ధ పెట్టి ఉంటే.. ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గత ఆరు నెలలుగా ఏ పనీ చేయకుండా కూర్చోవడమే నేటి ఈ సంక్షోభానికి కారణమని నిప్పులు చెరిగారు. బెంగాల్‌ను హస్తగతం చేసుకోవాలన్న యావతో ఈ ఆరునెలల కాలంలో రాష్ట్రానికి రోజూ వచ్చిపడ్డారని, ఆ శ్రద్ధ ఏదో కరోనా కట్టడిపై పెట్టి ఉంటే నేటి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది కాదని దుయ్యబట్టారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో కేంద్ర బలగాలు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకోకుండానే బెంగాల్‌లో అడుగుపెట్టాయని, ఫలితంగా కరోనా వ్యాప్తి పెరిగిపోయిందని ఆరోపించారు. గత ఆరు నెలల్లో కేంద్రం ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘బెంగాల్‌లో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి దేశాన్ని విధ్వంసం అంచుల్లోకి నెట్టేశారు. గత ఆరు నెలల్లో కేంద్రం ఎలాంటి పనీ చేయలేదు. బెంగాల్‌ను హస్తగతం చేసుకునేందు రోజూ ఇక్కడికి చక్కర్లు కొట్టారు’’ అని మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్త‌వానికి ఈ ఏడాది ప్రారంభంలోనే అనేక మంది నిపుణులు సైతం సెకండ్ వేవ్ వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. అయితే.. మోడీ స‌ర్కారు.. అప్ప‌టికే తొలిద‌శ లో విజ‌యం సాధించామ‌ని.. సెకండ్ వేవ్ వ‌చ్చేది భ్ర‌మేన‌ని భావించిన‌ట్టు కూడా తాజాగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సీఎం మ‌మ‌త వ్యాఖ్య‌లు మోడీకి మంట‌పెడుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.