Begin typing your search above and press return to search.

వాసవి రియల్ ఎస్టేట్ పై ఐటీ దాడులు.. టార్గెట్ కేసీఆర్ లో భాగమేనా?

By:  Tupaki Desk   |   18 Aug 2022 4:47 AM GMT
వాసవి రియల్ ఎస్టేట్ పై ఐటీ దాడులు.. టార్గెట్ కేసీఆర్ లో భాగమేనా?
X
తెలంగాణ రాష్ట్రంలో.. అందునా హైదరాబాద్ లో ప్రముఖ బిల్డర్ గా ఎదిగిన సంస్థల్లో వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ ఒకటి. ఎనిమిదేళ్ల క్రితం ఈ సంస్థ సైజుకు.. తాజా సైజ్ ను చూస్తే ఏ మాత్రం సంబంధం లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తక్కువ వ్యవధిలో.. భారీగా డెవలప్ అయిన రియల్ ఎస్టేట్ సంస్థల్లో వాసవి సంస్థ ఒకటిగా చెబుతుంటారు.

ప్రస్తుతం హైదరాబాద్ లోని చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో వాసవి గ్రూప్ ఒకటిగా చెబుతుంటారు. ఈ సంస్థ వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులకు లింకులు ఉన్నాయన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగానే వారి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు వాయు వేగంతో వెళ్లిపోతాయన్న ఆరోపణ ఉంది. అయితే.. ఇందులో నిజానిజాల మాటేమిటన్నది ఒక ప్రశ్న.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో టార్గెట్ కేసీఆర్ ప్రాజెక్టును కేంద్రంలోని మోడీ సర్కారు చేపట్టిన నేపథ్యంలో.. ఆయన ఆర్థిక మూలాల్ని దెబ్బ తీసే ప్రయత్నాలు గడిచిన కొంతకాలంగా ఒక పద్దతి ప్రకారం సాగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా వాసవి రియల్ ఎస్టేట్ సంస్థల మీద భారీ ఐటీ దాడులు జరిగినట్లుగా రాజకీయ వర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకకాలంలో ఈ సోదాల్ని నిర్వహించారు.

ఇక.. వాసవి గ్రూప్స్ ప్రధాన సంస్థలో ఏకంగా 20 మందితో కూడిన అధికారుల టీం సోదాల్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది. వాసవి గ్రూప్ లో వాసవి రియాల్టీ, వాసవి నిర్మాణ్, శ్రీముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఇండ్మాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిడిల్ వెంచర్స్ పేరుతో పలు సంస్థలు ఉన్నట్లు గా చెబుతారు. భారీ ప్రాజెక్టులు చేపట్టిన వాసవీ గ్రూప్.. పెద్ద ఎత్తున పన్ను చెల్లింపు విషయంలో ఎగవేతకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆరా తీసే క్రమంలోనే తాజా తనిఖీలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు.

తాజా సోదాల్లో భాగంగా ఇప్పటివరకు వాసవి గ్రూప్ పూర్తి చేసిన ప్రాజెక్టులు.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలపై ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు.. డెవలప్ మెంట్ కోసం సేకరించిన భూముల మీదా ప్రత్యేకంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేంద్రం సిరీస్ కంపెనీకి కేటాయించిన ప్రభుత్వ భూములపై ఈ సంస్థ కన్నేసిందని.. 2005 వరకు ఎలాంటి చర్యలకు నోచుకోని రూ.300కోట్ల విలువైన భూమికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో ఐటీ అధికారుల నజర్ పడినట్లుగా చెబుతున్నారు.

2005 వరకు సిరీస్ భూముల్ని పట్టించుకోని స్థానం 2021 నాటికి ఈ భూముల మీద అన్ని రకాలు ప్రొసీడింగ్స్ పూర్తి కావటంతోపాటు.. అమ్మకాలకు సిద్ధం కావటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. సిరీస్ కమాన్ కు వాసవి రియల్ ఎస్టేట్ బోర్డు ఎలా వేలాడుతోంది? ఎందుకు వేలాడుతోంది? అక్కడి భూముల్ని ప్లాట్లుగా వేసి ఎలా అమ్ముతున్నారు? ఈ ప్లాట్లను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలోనే తాజా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ భూములు ఎల్ బీనగర్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. వాసవీ గ్రూప్ నకు సంబంధించిన ఐటీ దాడుల ఉదంతం ప్రధాన మీడియాలో పెద్దగా ఫోకస్ కాలేదన్న మాట వినిపిస్తోంది.ఏమైనా.. సదరు రియల్ఎస్టేట్ సంస్థ లో ఐటీ దాడుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లుగా చెప్పక తప్పదు.