Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్..'గ్రేట్ డిప్రెషన్' ను మించిన సంక్షోభం తప్పదు

By:  Tupaki Desk   |   9 April 2020 3:30 PM GMT
కరోనా ఎఫెక్ట్..గ్రేట్ డిప్రెషన్ ను మించిన సంక్షోభం తప్పదు
X
ప్రపంచ దేశాలను వణికించేస్తున్న కరోనా మహమ్మారితో ఆర్థిక రంగానికి తీరని నష్టమన్న వాదన ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే. అయితే ఈ నష్టం ఏ మేర ఉంటుంది? ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ఎంత సమయం పడుతుంది? అసలు ఈ తరహా నష్టాన్ని మనం గతంలో చవిచూశామా? అన్న దిశగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సంచలనాలకే సంచలనంగా నిలుస్తున్న నివేదికను గురువారం విడుదల చేసింది. కరోనా కారణంగా గతంలో మనమెన్నడూ చవిచూడనంత మేర నష్టం జరగబోతోందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నష్టం అప్పుడెప్పుడో 1929లో మొత్తం అన్ని దేశాలను అతలాకుతలం చేసిని గ్రేట్ డిప్రెషన్ కంటే కూడా అధికంగా ఉండబోతోందని ఆమె చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాయని ఇప్పటికే అన్ని సంస్థలు చెప్పేశాయి. 2009లో వచ్చిన ఆర్థిక సంక్షోభం కంటే కూడా తీవ్రమైన సంక్షోభం తప్పదని ప్రపంచ బ్యాంకు సహా... అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా అంచనా వేశాయి. మన రిజర్వ్ బ్యాంక్ కూడా ఇదే తరహా అంచనాను చెప్పేసింది. అంతేకాకుండా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడే దిశగా చర్యల కోసం అన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఐఎంఎఫ్ గురువారం విడుదల చేసిన నివేదక చూస్తే... దాదాపుగా అన్ని దేశాలు కూడా పెను షాక్ కు గురి కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

1929లో ఎదురైన గ్రేట్ డిప్రెషన్ నుంచి ప్రపంచ దేశాలు కోలుకునేందుకు దాదాపుగా పదేళ్లకు పైగానే పట్టింది. అంటే... ఇప్పుడు ఐఎంఎఫ్ చెబుతున్న దాని ప్రకారం గ్రేట్ డిప్రెషన్ కంటే కూడా అదిక ప్రభావం చూపే సంక్షోభం రానుందంటే... దాని నుంచి తేరుకునేందుకు ప్రపంచ దేశాలు పదేళ్లకు పైగానే ఈ మాంద్యంలో కొట్టుమిట్టాడాల్సిందేనన్న మాట. అంటే... ఈ సంక్షోభం నుంచి కోలుకునేందుకు పదేళ్లకు పైగానే పడుతుందన్న మాట. ఇదే జరిగితే... ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా భారీ ప్రభావానికి గురి కాక తప్పదన్న మాట. ఇదిలా ఉంటే ఐఎంఎఫ్ నివేదిక విడుదలైన గురువారమే ఆర్బీఐ కూడా ఇదే తరహాలో ఓ నివేదికను విడుదల చేసింది. కరోనా కారణంగా భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా గతంలో మునుపెన్నడూ చవిచూడని ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయని ఆర్బీఐ తన నివేదికలో పేర్కంది. మొత్తంగా చెప్పాలంటే... కరోనా కారణంగా ఆర్థిక రంగం కుదేలవడం మాత్రం గ్యారెంటీ. ఇలాంటి నేపథ్యంలో మనం కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులకు అయినా ముందే సిద్ధం కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.