Begin typing your search above and press return to search.

దేశంలో ఆ 50 శాతం మంది కరోనా నుండి సేఫ్ : ఐఐపీహెచ్‌

By:  Tupaki Desk   |   4 Aug 2020 12:30 AM GMT
దేశంలో ఆ 50 శాతం మంది కరోనా నుండి సేఫ్ : ఐఐపీహెచ్‌
X
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తుంది. కరోనా వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటునప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా మహమ్మారి కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య లక్ష దాటిపోయింది.

ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని ఐఐపీహెచ్ (ఇండియన్ ‌ఇన్ ‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థ ) కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. వైరస్ సోకిన వ్యక్తి నుండి ఇతరులకు వైరస్ వ్యాపిస్తుందని కచ్చితంగా చెప్పలేము అని , వైరస్ తో చనిపోయిన వారి కుటుంబంలో సైతం ఇతర కుటుంబ సభ్యులకు వైరస్ అంటుకోని ఉదాహరణలు ఉన్నాయని తెలిపింది. ఐఐపీహెచ్ డైరెక్టర్‌ దిలీప్‌ మవలాంకర్‌ మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు వైరస్‌ సోకే అవకాశాలపై అంతర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం చేసాం అని తెలిపారు. అహ్మదాబాద్ లో కేసుల సంఖ్య భారీగా పెరిగి ఒక్కసారిగా తగ్గాయని, అందుకు కారణం హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడమేనేమో అని అన్నారు.

ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్నవారికి వైరస్ సోకదని , యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌ న్యూరో సైంటిస్ట్‌ కార్ల్‌ ఫ్రిస్టన్‌ ప్రతిపాదించిన ‘ఇమ్యూనలాజికల్‌ బ్లాక్‌ హోల్‌’ సిద్ధాంతం ప్రకారం జనాభాలో 50% మందికి కరోనా సోకదని తెలిపారు. అంతే కాకుండా జనాలు ఇంటికే పరిమితం కావడం వల్ల కూడా వైరస్ ప్రభావం తగ్గిందని అన్నారు. . తాజాగా గడిచిన 24 గంటల్లో మరోసారి రికార్డ్‌ స్థాయిలో 52,972 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటెన్‌ను విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 18,03,695కి చేరింది.