Begin typing your search above and press return to search.

రాజస్తాన్‌ లో హైదరాబాద్ సైబర్‌ క్రైం పోలీసుల సాహసం .. కళ్లల్లో కారం కొట్టినా వెనుకడుగు వేయలేదు !

By:  Tupaki Desk   |   17 Oct 2020 2:50 PM GMT
రాజస్తాన్‌ లో హైదరాబాద్ సైబర్‌ క్రైం పోలీసుల సాహసం .. కళ్లల్లో కారం కొట్టినా  వెనుకడుగు వేయలేదు !
X
సైబర్ నేరాలకు పాల్పడుతూ , ఇప్పటివరకు ఎక్కడా చిక్కకుండా పోలీసులకి సైతం చుక్కలు చూపించిన రాజస్థాన్ భరత్ పూర్ కేటుగాళ్ల ఆటలు హైదరాబాద్ పోలీసులు , అక్కడి పోలిసుల సాయంతో కట్టించారు. ఇటీవలే సైబరాబాద్‌ పోలీసులు భరత్‌ పూర్‌ కు చెందిన ఒక సైబర్‌ దొంగల ముఠాను పట్టుకున్న విషయం తెలిసిందే. అదే బాటలో రంగంలోకి దిగిన హైదరాబాద్‌ పోలీసులు రాజస్థాన్‌ జిల్లా భరత్‌పూర్‌ జిల్లా చుల్హెరా, కళ్యాణ్‌పూర్‌, ఖారికా ప్రాంతాలకు చెందిన ఘరానా సైబర్‌ నేరగాళ్లు అయిన పదిమందిని శుక్రవారం అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. అయితే వీరిని అరెస్ట్ చేసే సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురైయ్యాయి. వారి కుటుంబాల నుండి ప్రతిఘటనలు ఎదురైయ్యాయి , పోలిసుల కళ్లల్లో కారం కూడా కొట్టారు. అయితే , పోలీసులు వెన్ను చూపకుండా అరెస్ట్ చేసిన తర్వాతే వెనుదిరిగి వారితో పాటుగా వచ్చారు.

భరత్‌పూర్‌ జిల్లాకు చెందిన చాలా గ్రామాల్లో ఈ ఓఎల్‌ఎక్స్‌ కేటుగాళ్ల అడ్డాలు ఉన్నాయి. ఆర్మీ అధికారుల మాదిరిగా ఫొటోలకు పోజులిస్తూ ఓఎల్‌ ఎక్స్‌ వంటి ఈ–యాడ్స్‌ వెబ్ ‌సైట్లలో వివిధ ప్రకటనలు ఇస్తుంటారు. సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ప్రకటనలు ఇస్తుంటారు. వాటిని చూసి సంప్రదించిన వారి నుంచి అడ్వాన్సుల రూపంలో వీలున్నంత దోచేస్తారు. మరోపక్క ఆయా వెబ్ ‌సైట్లలో సామాన్యులు పెట్టిన సెకండ్‌ హ్యాండ్‌ వస్తువుల అమ్మకం ప్రకటనలకు స్పందించి వాటిని విక్రయిస్తామని కూడా డబ్బు స్వాహా చేస్తారు. మే,2018 నుంచి ఇప్పటివరకూ దేశంలో ఎంతోమందిని ఈ ముఠాలు బురిడీ కొట్టించాయి. వాహనాలు,ఫోన్లు,ఫర్నీచర్,ఎలక్ట్రానిక్ వస్తువులు... ఇలా ఏదైనా వస్తువును మొదట ఈ గ్యాంగ్ ఓల్ఎక్స్ తదిరత ప్లాట్‌ ఫామ్స్ ‌లో విక్రయానికి పెడుతారు. నిజానికి వాళ్ల వద్ద ఆ వస్తువేదీ ఉండదు, కానీ అమాయకులకు టోకరా వేసి డబ్బులు దండుకునేందుకు ఈ ప్లాట్‌ ఫామ్స్‌ ను ఉపయోగించుకుంటారు.

గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌ లో ఈ గ్యాంగ్ నేరాలు పెరిగిపోవడంతో ఇక్కడి పోలీసులు భరత్‌పూర్‌ ఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఓఎల్‌ ఎక్స్‌ సైబర్‌ చీటర్లపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టిన అక్కడి పోలీసులు, మొదట 8 మందిని అరెస్ట్ చేసి 800 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ లో పలువురిని వీరు మోసం చేసినట్లు గుర్తించారు. దీనిపై హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో... ఇక్కడి పోలీసులు రాజస్తాన్ వెళ్లి పీటీ వారెంట్‌పై 8మందిని అరెస్ట్ చేసి ఈ నెల 9న వారిని నగరానికి తీసుకొచ్చారు. మరో నాలుగు కేసుల్లోనూ పక్కా ఆధారాలు ఉండటంతో ఆయా గ్యాంగ్‌లను అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు రాజస్తాన్ వెళ్లారు. భరత్ ‌పూర్ ఎస్పీ సహకారంతో స్థానిక పోలీసులతో కలిసి 20 వాహనాల్లో 100 మంది సిబ్బంది ఆయుధాలు,టియర్ గ్యాస్ ‌తో చుల్హెర, కల్యాన్‌ పుర గ్రామాలకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి 2గంటలకు పోలీసులు అక్కడికి చేరుకోగా... అప్పటికే పోలీసుల రాకను గుర్తించిన గ్రామస్తులు వారిపై రుళ్లు రువ్వారు. పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు. మహిళలు పోలీసుల కళ్లల్లో కారం పొడి చల్లారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించిమరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు.