Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ తలనొప్పి..ఆఫీసుల్లో డైలీ స్కోర్ చెప్పలేక చస్తున్నారట

By:  Tupaki Desk   |   14 Oct 2021 9:40 AM GMT
హుజూరాబాద్ తలనొప్పి..ఆఫీసుల్లో డైలీ స్కోర్ చెప్పలేక చస్తున్నారట
X
కొన్నిసార్లు అంతే.. ఊహించని రీతిలో పరిణామాలు ఉంటాయి. మారిన పరిస్థితుల్లో కొన్ని విషయాలకు ఇచ్చే ప్రాధాన్యత మరికొన్ని విషయాల్లో పెద్ద పట్టనట్లుగా వ్యవహరించటం మీడియా సంస్థల్లో ఈ మధ్యన ఎక్కువైంది. అదే సమయంలో గతానికి వర్తమానానికి మరో పెద్ద తేడా వచ్చి చేరింది. గతంలో ఏ మీడియా సంస్థలో అయినా సరే.. సదరు రిపోర్టర్ ఏదైనా వార్తకు సంబంధించిన సమాచారం ఇచ్చిన తర్వాత పెద్దగా సందేహాలు ఉండేవి కావు. కొన్ని సందేహాలు ఉంటే రెండు.. మూడు ప్రశ్నలు వేసి ఓకే చేసేవారు.

ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. ఎందుకంటే బోలెడన్ని మీడియా సంస్థలు పుట్టుకురావటం.. సందుకో సుబ్బారావు అన్నట్లుగా పెద్దగా గుర్తింపు లేని యూ ట్యూబ్ చానళ్లు.. సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపులు.. ఇలా ఎవరికో ఎక్కడో ఏ మెదడులో వచ్చిన ఆలోచన కూడా ఒక్కోసారి వైరల్ న్యూస్ గా మారుతుంది. దీని మీద మీడియా సంస్థల్లో బోలెడంత చర్చ.. రభస ఈ మధ్యన ఎక్కువైంది. ఇక.. ఏదైనా పొలిటికల్ డెవలప్ మెంట్ ఉంటే.. దాన్ని ఈకకు ఈక.. పీకకు పీక అన్నట్లుగా ఏరుతున్న వైనం పెద్ద తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.

మారిన పరిస్థితుల్లో రిపోర్టర్లు.. అందునా పొలిటికల్ రిపోర్టర్ల పరిస్థితి మహా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. పోటాపోటీగా సాగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరన్నది ఒక స్టాండర్డ్ ప్రశ్న అయితే.. రోజు రోజుకు.. కొన్ని సందర్భాల్లో ఉదయం.. మధ్యాహ్నం.. సాయంత్రం.. ఇలా మూడు పూటల హైదరాబాద్ నుంచి హుజూరాబాద్ రిపోర్టర్లకు వస్తున్న ఫోన్ కాల్స్ తో వారు విసిగి వేశారిపోతున్నారట. ఒక్కో మీడియా ఆఫీసుకు చెందిన ఇద్దరు.. ముగ్గురు ఫోన్లు చేయటం.. ఇవాల్టి పరిస్థితి ఏమిటి? లాంటి ప్రశ్నలతో వారు తీవ్రమైన ఇబ్బందికి గురవుతున్నట్లు చెబుతున్నారు. నిత్యం..రాజేందర్ కు వచ్చే మెజార్టీ ఎంత? టీఆర్ఎస్ అభ్యర్థికి పరిస్థితిలో ఎంత మార్పు వచ్చిందన్న ప్రశ్నలకు..సమాధానాలు చెప్పలేక ఒళ్లు మండిపోతుందని చెబుతున్నారు.

మార్పు అన్నది ఏదైనా పెద్ద పరిణామం చోటు చేసుకుంటే ఉంటుంది. అంతేకాదు.. ఒకేలాంటి వాతావరణంలో పొద్దున.. మధ్యాహ్నం.. సాయంత్రానికి పరిస్థితుల్లో మార్పులు ఎందుకు వస్తాయి? అన్న ప్రశ్న మనసులోనే ఉంచుకొని.. చాలా ఒద్దికగా.. పద్దతిగా సమాధానాలు చెప్పాల్సి వస్తోందట. దీనికి తోడు ఏవేవో గ్రూపుల్లో వచ్చే పోస్టులకు సైతం వివరణ ఇవ్వటంతో వారు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు చెబుతున్నరు. ఎప్పుడెప్పుడు ఈ ఉప ఎన్నిక రచ్చ పోయి.. మనశ్శాంతి వస్తుందో అన్న దాని కోసం ఎదురుచూస్తున్నారట.