Begin typing your search above and press return to search.

కరోనా : ఆస్పత్రి మెట్లపై భార్య ఒడిలో భర్త మృతి !

By:  Tupaki Desk   |   22 April 2021 11:31 AM GMT
కరోనా : ఆస్పత్రి మెట్లపై భార్య ఒడిలో భర్త మృతి !
X
మహారాష్ట్రలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు మరింతగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన మొదట్లో కంటే సెకండ్ వేవ్ లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల కష్టాలు , భాదలు వర్ణనాతీతం. కరోనా ను అదుపు చేయడంలో పూర్తిగా విఫలం అయిన ప్రభుత్వం .. నేటి నుండి మే 1 వరకు సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే .. కరోనా మహమ్మారి భారిన పడి ,కోలుకోలేక చనిపోయే వారు కొందరు అయితే , కరోనా భారిన పడిన తర్వాత సరైన చికిత్స అందక , హాస్పిటల్స్ లో బెడ్స్ లేక ఆక్సిజన్ సరైన సమయానికి అందుబాటులో లేక చనిపోయే వారే మహారాష్ట్రలో పెరిగిపోతున్నారు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి.

దీంతో వైరస్‌ బారిన పడి పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనే నాసిక్‌ జిల్లా చాంద్వాడ్ ‌లో చోటుచేసుకుంది. కరోనా సోకిన అరుణ్‌ మాలి అనే వ్యక్తిని అతడి భార్య ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. అయితే ఆస్పత్రిలో బెడ్లు ఖాళీగా లేవని సిబ్బంది అతడిని చేర్చుకోలేదు. ఇంతలో అరుణ్ కి ఊపిరి తీసుకోవడం కూడా కష్టం మారింది. కనీసం ఆక్సిజన్‌ అయినా పెట్టాలని భార్య ఆసుపత్రి సిబ్బందిని వేడుకుంది. వైద్య సిబ్బంది స్పందించే లోపే తన భార్య ఒడిలోనే భర్త అరుణ్ కన్నుమూశాడు. కళ్లముందే భర్త ప్రాణాలు పోతుంటే, కాపాడుకోలేని దుస్థితిలో భార్య ఉంది. తన భర్త ఇక లేడనే వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. అందుకే వైద్యులు , ప్రభుత్వాలు మొత్తుకొని చెప్తున్నాయి. కరోనా మహమ్మారి తో జాగ్రత్త , కరోనా నియమాలు పాటించండి అని , కానీ, జరుగుతున్న ఘోరాలని చూస్తున్నా కూడా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా జీవితంలో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఎదురౌతుంది.