Begin typing your search above and press return to search.

శిల్పా చౌదరి చీటింగ్ కేసు: పోలీసుల విచారణలో భారీ ట్విస్టులు

By:  Tupaki Desk   |   3 Dec 2021 5:43 AM GMT
శిల్పా చౌదరి చీటింగ్ కేసు: పోలీసుల విచారణలో భారీ ట్విస్టులు
X
టాలీవుడ్ సినీ హీరోలు, సినీ ప్రముఖులను నమ్మించి వారికి భారీ వడ్డీని ఆశచూపి కోట్లు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టిన మాయలేడి శిల్పా చౌదరి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మహేష్ బాబు సోదరికి కూడా ఈమె రూ.2 కోట్లు ఎగనామం పెట్టినట్టు తేలడం అందరిని విస్తుగొలుపుతోంది.

శిల్పా చౌదరి బాధితుల లిస్ట్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆమె క్రైం హిస్టరీ ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. పోలీసుల విచారణలో ఇంకా నమ్మలేని నిజాలు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది.

సినీ ప్రముఖులకు మాయమాటలు చెప్పి కోట్లు కొల్లగొట్టిన కిలాడీ లేడి శిల్పా చౌదరికి తాజాగా కోర్టులో చుక్కెదురైంది. ఉప్పర్ పల్లి కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ మోసం కేసులో ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు బెయిల్ ఇచ్చిన కోర్టు.. శిల్పా చౌదరిని మాత్రం ఐదురోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు నుంచి శిల్పాచౌదరిని పోలీసులు విచారించనున్నారు.

శిల్పా చౌదరి టాలీవుడ్ సినీ ప్రముఖులను చీటింగ్ కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. సెలబ్రెటీలు, వారి కుటుంబ సభ్యుల దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా చౌదరి వారికి నకిలీ బంగారం, నకిలీ చెక్కులు అంటగట్టింది.

హీరో సుధీర్ బాబు భార్య, మహేష్ చెల్లెలు ప్రియదర్శిని దగ్గర రూ.2 కోట్ల 90 లక్షలు తీసుకున్న శిల్పా చౌదరి మూడు నకిలీ చెక్కులు, నకిలీ బంగారాన్ని ష్యూరిటీస్ గా ఇచ్చినట్టు బయటపడింది.

తాజాగా చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంక్ కు వెళ్లిన ప్రియదర్శిని మోసపోయినట్టు తెలుసుకొని అవాక్కైంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు ప్రియదర్శిని. ఆరు నెలల తర్వాత డబ్బు తిరిగి ఇస్తానని చెప్పి శిల్పా చౌదరి డబ్బు తీసుకుందని.. అడిగితే బౌన్సర్లతో బెదిరిస్తోందని ప్రియదర్శిని ఆరోపిస్తోంది.

శిల్పా చౌదరి బాధితుల్లో ఎక్కువ మంది ప్రముఖులే ఉన్నట్టు సమాచారం. అయితే కొంతమంది బాధిత బడా మహిళలు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది. బ్లాక్ మనీ, ఐటీకి భయపడి ఫిర్యాదు చేయలేకపోతున్నారని అంచనా.. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా డబ్బులిచ్చి తలలు పట్టుకుంటున్నారట సినీ ప్రముఖులు.

ఇక శిల్పాచౌదరి ఇలా సినీ ప్రముఖుల నుంచి వసూలు చేసిన సొమ్ము రూ.50 కోట్ల వరకూ హవాలా ద్వారా దుబాయ్ తరలించినట్టు మరో యాంగిల్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే శిల్పాచౌదరికి ఉన్న ఆరు బ్యాంక్ అకౌంట్లపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

కిట్టీ పార్టీ పేరుతో మోసం చేసిన శిల్పా అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అధిక వడ్డీ ఇస్తానని ఇతరుల వద్ద నుంచి డబ్బు లాగిన ఈమె వ్యవహారం బయటపడడంతో బాధితులంతా తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నారు. శిల్పా చక్రవర్తి ద్వారా తామంటే.. తాము మోసపోయామని సెలబ్రెటీలు ఆందోళన చెందుతున్నారు.

అధిక వడ్డీకి ఆశపడి తమ పిల్లల కోసం దాచుకున్న డబ్బునంతా శిల్పాకే అప్పగించామని తాజాగా ఓ మహిళ తన గోడును పోలీస్ స్టేషన్లో వెళ్లబోసుకుంది. అయితే శిల్పా సేకరించిన డబ్బంతా ఓ ఖరీదైన బంగ్లా నిర్మించుకోవడానికే వాడుకుందని పోలీసులు తేల్చారు.

నార్సింగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుతో శిల్ప చౌదరి, ఆమె భర్తలు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ విషయం బయటికి రావడంతో బాధితులు పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు ఇస్తున్నారు. మొదట 2 కోట్ల 50 లక్షలు ఫ్రాడ్ చేసిందని ప్రియా అనే మహిళ ఫిర్యాదు చేశారు. తన పిల్లల కోసం దాచుకున్న డబ్బును అధిక వడ్డీ ఇస్తానంటే శిల్పాకు ఇచ్చామని ఆమె పేర్కొంది.

అయితే రెండేళ్ల నుంచి వడ్డీ కట్టకపోగా తిరిగి అసలు మొత్తాన్ని ఇవ్వడం లేదని ఫిర్యాదులో తెలిపింది. ప్రియా ఫిర్యాదుతో శిల్పా వ్యవహారం బయటకు రావడంతో బాధితులు ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తున్నారు. ఇప్పటి వరకు నార్సింగి, మాదాపూర్, జూబ్లి హిల్స్, బంజారా హిల్స్ లన్నింటిలో కలిసి ఎనిమిది కేసులు నమోదయ్యాయి.